మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రాజధాని అమరావతి గురించి వార్తలు చూసి రాష్ట్ర ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఒకవేళ జగన్ విశాఖలో రాజధాని ఏర్పాటు చేసి ఉండి ఉంటే ఏం జరిగేదో కానీ ఏమీ చేయకుండా దిగిపోవడం వలన ఇంతకాలం రాష్ట్ర రాజధానిపై నెలకొన్న అస్పష్టత తొలగిపోయింది. ఇప్పుడు ఏపీ రాజధాని ఏది? అనే ప్రశ్నకు అమరావతి అని టక్కున చెప్పగలుగుతున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ స్పష్టత ఇవ్వడమే కాకుండా అమరావతి నిర్మాణ పనులకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ ఉదేశ్యపూర్వకంగా రాజధాని ప్రాంతాన్ని, దానిలో వివిద దశలలో నిర్మాణంలో ఉన్న భవనాలను, రోడ్లను పాడుబెట్టడం వలన 24,000 ఎకరాలలో దట్టంగా తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి.
వాటిని తొలగించడానికే ప్రభుత్వం రూ.36 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏకధాటిగా నాలుగు నెలలు వందలాదిమంది కార్మికులు, యంత్రాలతో వాటన్నిటినీ తొలగించారు. ఇప్పుడు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు సర్వం సిద్దం అయ్యింది. డిసెంబర్ నెల నుంచి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పట్లు చేస్తోంది.
ఇటీవల చెన్నై, హైదరాబాద్ ఐఐటిల నుంచి నిపుణులు వచ్చి గత 5 ఏళ్ళుగా నీళ్ళలో మునిగి ఉన్న హైకోర్టు, సచివాలయం తదితర భవనాల పునాధులను పరిశీలించి అవన్నీ ధృఢంగా ఉన్నాయని వాటిపై నిర్మాణాలు చేపట్టవచ్చని తేల్చి చెప్పడం చాలా ఊరట కలిగించేదే.
పునాదులు సిద్దంగా ఉన్నాయి కనుక వాటిపై ముందు అనుకున్న ప్రకారం భవనాల నిర్మాణం శరవేగంగా చేయవచ్చు. ఈసారి 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కనుక అదే డెడ్లైన్గా భావించి యుద్ధప్రాతిపదికన అమరావతి నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంటుంది. కనుక 2027లోగా రాజధాని అమరావతికి రూపురేఖలు రావచ్చు.
పదేళ్ళుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే మూడేళ్ళలోనే ఓ దివ్యమైన అమరావతి ఏర్పడితే అందరికీ సంతోషమే కదా? అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, ఐటి కంపెనీలు వగైరా కూడా తరలిరావడం తధ్యం. అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఇదీ… మా రాజధాని అని సగర్వంగా చెప్పుకోగలుగుతారు.
—




