గత 5 ఏళ్ళ జగన్ పాలనలో టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు ఎన్నో కేసులు, వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నారు. జగన్ పాలనలో పోలీసులు అర్ధరాత్రి పూట టిడిపి నేతల ఇళ్ళలోకి గోడలు దూకి ప్రవేశించడం, ఇళ్ళు కూలగొట్టడం, ఏదో పేరుతో అరెస్ట్ చేసి పోలీస్ వాహనాలలో తిప్పుతూ వేధించేవారు.
టిడిపి కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. వారు రోజూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వలన ఉద్యోగాలు, ఉపాధి పనులకు వెళ్ళలేక ఆర్ధికంగా నానా కష్టాలు అనుభవించేవారు. జగన్ పాలనలో అనేక మంది టిడిపి కార్యకర్తలు హత్య చేయబడగా పలువురు భయంతో ఊర్లు వదిలిపారిపోయారు.
వల్లభనేని వంశీ వంటివారు పట్టపగలే టిడిపి కార్యాలయంపై దాడులు చేయించి, వాహనాలు తగులబెట్టి అడ్డువచ్చిన పట్టాభిరామ్ వంటి టిడిపి నేతలపైనే తిరిగి కేసులు నమోదు చేసి జైలుకు పంపించి వేధించారు.
టిడిపిలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరకు ప్రతీ ఒక్కరూ ఏదో విదంగా జగన్ ప్రభుత్వ వేధింపులకు గురైనవారే. సొంత ఎంపీ రఘురామ కృష్ణరాజు అరికాళ్ళు వాచిపోయేలా కొట్టించారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తొలిసారిగా 75 ఏళ్ళ వయసులో జైలులో గడపవలసి వచ్చింది. ఆయనను జైల్లో పెట్టించి జగన్, వైసీపి నేతలు చాలా పైశాచికానందం అనుభవించారు.
వైసీపి దౌర్జన్యాలకు బలైన టిడిపి నేతలు, కార్యకర్తలు ఆ చేదు అనుభవాలను జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేరు. వారి జీవితాలలో 5 ఏళ్ళ జగన్ పాలన ఓ భయంకరమైన పీడకలగా నిలిచిపోతుంది. వారే కాదు జగన్ పాలనలో వివిద వర్గాలకు చెందిన నిరుపేద ప్రజలు, రైతులు కూడా దౌర్జన్యాలను, భూకబ్జాల బాధితులే.
కనుక వారితో సహా టిడిపిలో ప్రతీ ఒక్కరూ ఇప్పుడు తమను వేధించి వేటాడిన జగన్, వైసీపి నేతలపై ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతున్నారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు కూడా జగన్, వైసీపి నేతలకు తగిన శాస్తి చేయాల్సిందే అంటున్నారు.
కానీ తాడేపల్లిలో అక్రమంగా నిర్మించిన వైసీపి కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయగానే ‘చంద్రబాబు నాయుడి విధ్వంసకర పాలన మొదలైందని, తమపై అప్పుడే కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టేశారంటూ’ జగన్తో సహా వైసీపి నేతలు, వారి మీడియా, సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచేందుకు వాడేసుకున్నారు.
ఇన్ని రోజులు ఆత్మరక్షణలో పడిన వైసీపి, తొలిసారిగా టిడిపి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయగలిగింది. కనుక వైసీపి ప్రచారాన్ని తేలికగా తీసుకున్నా, ఆ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసినా టిడిపి కూటమి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడం ఖాయం.
అలాగని వైసీపిని ఉపేక్షించినా చాలా ప్రమాదమేనని 2019 ఎన్నిలలో నిరూపితమైంది. మరోపక్క వైసీపి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పట్టుబడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు కాదనలేని పరిస్థితి.
కనుక జగన్-వైసీపి నేతలకు తమ ప్రభుత్వంపై ఈవిదంగా దుష్ప్రచారం చేసే అవకాశం ఈయకుండా, తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా, చట్టబద్దంగా కటిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ప్రతీకార రాజకీయాలకు ఇష్టపడని చంద్రబాబు నాయుడుకి ఇది కూడా ఓ కొత్త సమస్యే అని భావించవచ్చు.




