లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండు చోట్ల పోటీ చేసి గెలవడంతో వయనాడ్ సీటుని వదులుకున్నారు. కనుక అక్కడి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసిన ఆయన సోదరి ప్రియాంకా గాంధీ తప్పకుండా గెలుస్తారని అందరూ ముందే ఊహించారు. అలాగే గెలిచారు కూడా.
అయితే రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలువగా, ఆమె తన సోదరుడు కంటే మరో 44,000 ఓట్లు ఎక్కువ సాధించడం విశేషం. అదీ.. ఆమె తొలిసారిగా వయనాడ్ నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి, తొలి ప్రయత్నంలోనే తన సమీప ప్రత్యర్ధిపై 4.04 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం.
కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తమిళనాడులో అధికారంలోకి రాలేకపోతోంది. కానీ కేరళలో కాంగ్రెస్ కూటమి చాలా కాలంగానే అధికారంలో ఉంటోంది. కనుక ప్రియాంక గాంధీ గెలుపు పెద్ద విచిత్రమేమీ కాదనే భావించవచ్చు.
అయితే తొలిసారిగా ఎన్నికలలో గెలిచి, తొలిసారిగా లోక్ సభలో అడుగు పెట్టబోతున్న ప్రియాంక గాంధీ, తనపై ఇంత ఆదరణ చూపి గెలిపించిన వయనాడ్ నియోజకవర్గానికి, అక్కడి ప్రజలకు ఏమైనా చేస్తారా? చేయగలరా? అంటే అనుమానమే!
ఇప్పుడే ఈవిదంగా చెప్పడం తొందరపాటే అనిపిస్తున్నప్పటికీ, ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీరుని చూస్తే ఎవరైనా సరే ఈ అనుమానం నిజమేనని అంగీకరించకమానరు. రాహుల్ గాంధీ 2019 నుంచే వయనాడ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపిలతో రాజకీయ యుద్ధాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పైగా కేంద్రంలో, కేరళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు.
కనుక ఇప్పుడు ప్రియాంక గాంధీ సైతం పార్లమెంటులోపలా బయటా మోడీ, బీజేపీలతో రాజకీయ యుద్ధాలు చేయడానికే పరిమితం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ప్రియాంక గాంధీ ‘లాంచింగ్ చాలా గ్రాండ్’గా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆమె తల్లి సోనియా గాంధీకి ఇంత కంటే సంతోషమైన విషయం ఏముంటుంది?




