తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏకసభ్య కమీషన్కు తిరుపతిలో శ్రీ పద్మావతి అతిథి గృహంలో మెుదటి అంతస్తుని కార్యాలయంగా కేటాయించింది. అక్కడి నుంచే దినేష్ కుమార్ కమీషన్ నేటి నుంచి విచారణ ప్రారంభించింది. నేటి నుంచి 45 రోజులలోగా కమీషన్ విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి ఉంటుంది.
ఈ కమీషన్ విచారణకు అవసరమైన టిటిడీ, విజిలెన్స్, పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన రికార్డులు ఏర్పాటు చేసేందుకు ఓ లైజినింగ్ అధికారిని కూడా నియమించింది. కమీషన్కు డ్రైవర్తో సహా ఐదుగురు సహాయ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ ప్రధానంగా 2021-2024 మద్య కాలంలో అంటే వైసీపీ హయంలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను, నాణ్యత ప్రమాణాలను పాటించడంలో జరిగిన వైఫల్యాలను, విధానపరంగా జరిగిన ఆకస్మిక మార్పులు, అందుకు గల కారణాలను గుర్తిస్తుంది. మొత్తంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి ఏవిధంగా జరిగింది? ఏ మేరకు జరిగింది? దీని వలన ఎవరెవరు లబ్ది పొందారు? దీనికి ఎవరెవరు బాధ్యులు? గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
ప్రభుత్వం ఏకసభ్య కమీషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించగానే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అభ్యంతరం చెపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. కనుక కమీషన్ రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా ప్రభుత్వం చట్ట పరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఖాయమే. అందువల్లే వైసీపీ నేతలు కమీషన్ ఏర్పాటుపై ఆందోళన చెందుతున్నట్లున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించకపోతే భవిష్యత్లో అది కూడా మూల్యం చెల్లించాల్సి రావచ్చు.




