తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి…ఈ అంశంలో వైసీపీ కూటమి మీద పై చేయి సాధించిందా అంటే ఈ వివాదంలో వైసీపీ స్పందనకు కూటమి పార్టీల ప్రతిస్పందన పరిశీలిస్తే ప్రస్తుతానికి అవుననే సమాధానమే చెప్పాలేమో..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వారి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు, బాబు ప్రకటనకు జనసేన అధినేత పవన్ ప్రాయచ్చిత్త దీక్షతో వైసీపీ పై తన పోరాటాన్ని మొదలుపెట్టారు.
ఇక బీజేపీ సైతం హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తారా.? ఏడుకొండల శ్రీవారి భక్తుల మనోభావాలతో వ్యాపారం చేస్తారా.? అంటూ వైసీపీ మీద రెచ్చిపోయింది. ఇలా ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఈ వివాదంలో అసలైన వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ విచారణకు సిట్ ని నియమించింది.
అయితే నాడు ఈ మూడు పార్టీల విమర్శలతో, కూటమి ప్రభుత్వ చర్యలతో వెనక్కి తగ్గిన వైసీపీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మాటదాటేసే రాజకీయాన్ని ఎంచుకుంది. అలాగే విచారణ జరిపిన సిట్ ఇప్పటికే కొంతమంది నిందితులను అరెస్టు చేసి జైళ్లకు తరలించింది.
అయితే తాజాగా బయటకొచ్చిన సిట్ నివేదికలో తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు కానీ అసలు లడ్డు తయారీలో వాడిన నెయ్యి పాల ఉత్పత్తులతో తయారు చేసిన నెయ్యి కాదని, అది పామ్ ఆయిల్, కొన్ని రకాల రసాయనాలతో చేసిన నెయ్యి లాంటి మిశ్రమం అంటూ తేల్చింది.
అయితే సిట్ నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం లో వాడిన నెయ్యి కల్తీ నెయ్యి అనేది నిర్ధారణ అయ్యింది, కానీ జంతువుల కొవ్వు విషయంలో మాత్రం ప్రభుత్వ ప్రకటనకు సిట్ నివేదికకు మధ్య వ్యత్యాసం వచ్చింది. ఈ ఒక్క అంశాన్ని పట్టుకుని తప్పు చేసి కూడా వైసీపీ మొదలు పెట్టిన మత రాజకీయం కూటమిని ఇరుకునపెట్టే స్థాయికి చేరింది.
శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ అనేది బయటకొచ్చినా వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివేదికలో వైసీపీ కి క్లిన్ చిట్ వచ్చినట్టు, కూటమి ప్రకటించినట్టు నెయ్యి కల్తీ జరగలేదు అంటూ రుజువయినట్టు గల్లీ నుంచి ఢిల్లీ దాక నానా హంగామా చేసున్నారు.
వైసీపీ మత రాజకీయం కట్టలు తెంచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా రోడ్లమీదకొచ్చి మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని రెచ్చకొడుతున్నారు, బాబు ని బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు, పవన్ ను హేళన చేస్తూ జనసైనికులను కవ్విస్తున్నారు. అయితే బీజేపీ టచ్ చేసే సాహసం చెయ్యలేక బీజేపీ ని ఈ రాజకీయం నుంచి మినహాయించారు.
అయితే కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ తిరుమల నెయ్యి విషయంలో తమ తప్పేమి లేదంటూ ఇంతలా కల్తీ ప్రచారాలు చేస్తున్నా, ప్రజలను నమ్మించేందుకు ప్రాయచ్చిత్త పూజలు నిర్వహిస్తున్నా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ హిందుత్వ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీజేపీ నుంచి కానీ వైసీపీ మత రాజకీయానికి చెక్ పెట్టలేకపోతున్నారు.
ఈ అంశంలో వైసీపీ స్పందన కు తగ్గ ప్రతిస్పందన కూటమి నేతల నుంచి కరువయ్యింది. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ సైతం తన పార్టీ శ్రేణులను హెచ్చరించినట్టు మీడియాలో పలు వార్తలు వెలువడుతున్నాయి. వైసీపీ కల్తీ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జనసేన నాయకులు ఎందుకు చొరవ చూపించడం లేదని, వైసీపీ ని అడ్డుకోవడంలో ఎందుకు వెనకబడ్డారంటూ పవన్ తన పార్టీ సమావేశంలో నేతలను ప్రశ్నించినట్టు సమాచారం.
కిలో 400 కి నువ్వుల నూనె దొరకడం లేదు, అలాంటిది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది.? అలాగే సిట్ నివేదికలో ఎక్కడ జంతు కొవ్వు కలవలేదు అంటూ సిట్ చెప్పలేదు, సిట్ చెప్పని విషయాలను వైసీపీ ఇంతలా విష ప్రచారాలు చేస్తున్నా నాయకులు ఎందుకు దాని తిప్పికొట్టలేకపోతున్నారు అంటూ ఈ అంశాలను వెంటనే ప్రజలలోకి తీసుకెళ్ళంటూ పవన్ తన పార్టీ నేతలను ఆదేశించారు.
ఇక నేడు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద చర్చించి ఈ వివాదం వెనుక ఉన్న అసలు సూత్రధారులను తెరముందుకు తెచ్చేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. కూటమి ఆలోచనలను వైసీపీ హంగామా డామినేట్ చేయడంతో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు తమ పార్టీ శ్రేణులను రంగంలో దింపుతున్నారు.






