తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వివాదం ఏపీ రాజకీయాలలో వైసీపీ vs కూటమిగా సాగుతున్న తరుణంలో సిట్ ఇచ్చిన నివేదిక అటు వైసీపీకి ఇటు కూటమి అనుకూలంగా మారిందనే చెప్పాలి.
కూటమి ప్రభుత్వం ఆరోపించినట్టు జంతు కొవ్వు లేదని వైసీపీ వాదిస్తుంటే, అసలు అది నెయ్యే కాదని, పామ్ ఆయిల్, కొన్ని రసాయనాల మిశ్రమమని కూటమి అభిప్రాయపడుతోంది.
ఇందులో ఎవరి వాదన నమ్మాలో ఎవరి అభిప్రాయాన్ని విశ్వసించాలో అర్ధం కానీ చంచల స్థితిలో ఏపీ ప్రజలున్నారు అనేది వాస్తవం.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లడ్డు నాణ్యత పరిశీలిస్తే ఇటువంటి అనుమానాలకు, ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరుకుతుంది అనేది వెంకన్న భక్తుల అభిప్రాయంగా వినిపిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తడారిపోయినట్టు కనిపించేది. అలాగే లడ్డు నుంచి నెయ్యి సువాసన కూడా వచ్చేది కాదు, ఒకటి రెండు రోజుల నిల్వకే లడ్డు తినలేని స్థితికి వచ్చేసేది. కానీ ప్రస్తుతం వెంకన్న లడ్డు ప్రసాదంలో ఆ రకమైన ఛాయలు కనిపించడం లేదు.
లడ్డు నుంచి స్వచ్ఛమైన నెయ్యి సువాసన తో పాటుగా లడ్డు మృదువుగా, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, ఆ తేడా అనేది కంటి చూపుకి తెలుస్తుంది, చేతి స్పర్శకు అర్ధమవుతుంది.
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ నుంచి తమకు క్లిన్ చిట్ వచ్చినట్టే అన్నటుగా వైసీపీ చేసుకుంటున్న కల్తీ ప్రచారాలతో, రాజకీయ ఆధారాలు, కోర్ట్ తీర్పులతో వెంకన్న భక్తులకు పనిలేదు.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అన్నదానికి శ్రీవారి భక్తులకు ఏళ్లపాటు కొనసాగే విచారణలు అవసరం లేదు, ఎటూ తేలని విచారణ కమిటీల నివేదికలతో సంబంధం లేదు. వారికి వెంకన్న లడ్డు ప్రసాదం పై పూర్తి అవగాహన ఉంది.
లడ్డు ప్రసాదంలో నాటి కి నేటి ఉన్న వ్యత్యాసాన్ని శ్రీవారి భక్తులు స్పష్టంగా చూస్తున్నారు, వాటి నాణ్యత లో ఉన్న తేడాను గమానిస్తున్నారు. కాబట్టి వైసీపీ తమ హయాంలో తిరుమల లడ్డులో తమ తప్పులేదని ఎంతలా నమ్మించాలని చూసినా అందుకు శ్రీవారి భక్తులు సిద్ధంగా లేరనేది వైసీపీ గ్రహించాలి.






