ముద్రగడ పద్మనాభంని వైసీపిలో చేర్చుకుంటే ఆయన రాష్ట్రంలో కాపుల ఓట్లు గంపగుత్తగా వైసీపికి పడేలాచేస్తారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేస్తారని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆయన కూడా తాను అంత శక్తివంతుడిననే భావించారు. అందుకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేశారు.
కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. ఆయన కోసం గత నెలరోజులుగా నిద్రాహారాలు మానేసి పిఠాపురంలో పనిచేసిన జనసైనికులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అందుకే బహుశః వారు నూతన నామకరణ మహోత్సవం పేరుతో ముద్రగడ పద్మనాభం తరపున ఓ ఆహ్వాన పత్రికని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దానిలో వారు ఆయన భాషలోనే “అందరికీ నమస్కారమండీ… అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేశారండీ. కనుక కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో జూన్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఈ పేరు మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. కనుక కాపు సోదరసోదరీ మణులు అందరూ తప్పక ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా మా ప్రార్ధన. గమనిక”: మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలండి” అంటూ ఆహ్వానించారు.
ఒకవేళ పిఠాపురంలో వైసీపి అభ్యర్ధి వంగా గీత గెలిచినా ఆ క్రెడిట్ జగన్కే వెళుతుంది తప్ప ముద్రగడ పద్మనాభంకి రాదు. కానీ ఆమె ఓడిపోతే మాత్రం దానికి ముద్రగడ పద్మనాభమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జగన్ కోసం కాపుల ఓట్లు చీల్చే ప్రయత్నం చేసినందుకు, పవన్ కళ్యాణ్ గురించి వైసీపి నేతల్లా చులకనగా మాట్లాడినందుకు ముద్రగడ పద్మనాభం ప్రతిష్ట మసకబారింది.
ఇన్ని దశాబ్ధాలుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అన్నీ కేవలం ఈ రెండు నెలల్లో కోల్పోయారు. ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి, వంగా గీత ఓడిపోతే ఆయనను పట్టించుకునే నాధుడే ఉండకపోవచ్చు.




