అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశంలో తుపాకి మోత మోగింది! వైట్హౌస్ సమీపంలో గల హిల్టన్ హోటల్లో వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమావేశంలో ఓ వ్యక్తి హటాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఈ సమావేశంలో డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెక్సెత్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోతో సహా పలువురు ప్రముఖులున్నారు. వందల మంది అతిధుదులున్నారు. కానీ ఎవరికీ ప్రాణాపాయం కలుగలేదు. భద్రతా సిబ్బంది వెంటనే వారిని సురక్షితంగా అక్కడి నుంచి బయటకు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.
ఇంతమంది వివివిఐపీలున్న సమావేశానికి భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి ఓ వ్యక్తి తుపాకీతో లోనికి ప్రవేశించగలగడం, కాల్పులు జరపడం అమెరికా ప్రెసిడెంట్ భద్రత డొల్లతనానికి నిదర్శనమే.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రత ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఆయన ఎయిర్ ఫోర్స్-1 విమానమే ఓ అత్యాధునిక యుద్ధ విమానంతో సమానం. అయినా కూడా అది గాల్లో ఉన్నప్పుడు దానికి నాలుగైదు యుద్ధ విమానాలతో రక్షణ కల్పిస్తారు.
అమెరికా అధ్యక్షుడు భారత్ లేదా మరే దేశమైనా పర్యటనకు బయలుదేరితే ఆయన కంటే ముందుగానే అమెరికా నుంచి ఆయన కార్ల కాన్వాయ్, భద్రతా సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ దిగిపోతాయి. వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అందరూ చూస్తూనే ఉన్నారు.
విదేశాలలో ఇంత హడావుడి చేస్తున్నప్పుడు వైట్హౌస్ పక్కనే ఇలాంటి వివివిఐపీలు బస చేసే హిల్టన్ హోటల్లో ఇంతమంది వివివిఐపీలు సమావేశం జరుగుతున్నప్పుడు భద్రతలో ఇంత లోపమా? హవ్వ! అని యావత్ దేశాలు ముక్కున వేలేసుకోకుండా ఉంటాయా?




