“నాకు యుద్ధాలు ఆపి మానవాళిని రక్షించడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే 7-8 యుద్ధాలు ఆపి లక్షల మంది ప్రాణాలు కాపాడాను. కనుక నోబుల్ శాంతి బహుమతికి నాకంటే అర్హుడు ఎవరుంటారు?” అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఎవరూ మరిచిపోలేదు.
అన్ని నీతులు మాట్లాడిన ట్రంప్ ఈరోజు తెల్లవారుజామున వెనిజులాపై తన యుద్ధ విమానాలు పంపించి భీకర దాడులు చేయించారు.
వెనిజులా చమురు నిక్షేపాలపై చాలా కాలంగానే అమెరికా కన్నుంది. కనుక ఆ దేశంపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలంటే తెలివిగా ఆలోచించాలి. బలమైన కారణం చూపాలి. ట్రంప్ ఆ కారణం కనిపెట్టారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకి మాదకద్రవ్యాల సరఫరా ముఠాలతో సంబంధాలున్నాయని, వాటిని అయన ప్రోత్సహిస్తున్నారని ట్రంప్ కొన్ని వారాల క్రితం ఆరోపించారు. వెనిజులా నుంచి సరఫరా అవుతున్న ఈ మాదకద్రవ్యాల ప్రభావం అమెరికన్లు వాటికి బానిసలుగా మారుతున్నారని, అనేక మంది చనిపోతున్నారని ట్రంప్ చెప్పారు.
కనుక అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా మారిన వెనిజులాలోని మాదకద్రవ్యాల ముఠాలను అంతం చేయక తప్పదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
అంటే ఓ కుక్కని చంపాలనుకున్నప్పుడు ముందుగా దానిపై ‘పిచ్చికుక్క’ ముద్ర వేసి, దాని వలన సమాజానికి ప్రమాదం అని అందరినీ నమ్మించాలి. డోనాల్డ్ ట్రంప్ కూడా సరిగ్గా ఇదే చేశారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా చేసిన జార్జ్ బుష్ వంటివారు కూడా ఇలాగే చేశారు.
ఓ పక్క రష్యాతో శాంతి చర్చలు జరుపుతూ, ఉక్రెయిన్పై దాడులు నిలిపివేయాలని కోరుతూ, మరోపక్క వెనిజులాపై భీకర దాడులు చేయించి డోనాల్డ్ ట్రంప్ తన ద్వంద వైఖరిని మరోసారి బయటపెట్టుకున్నారు. ఆయిల్ అవసరాలు తీర్చుకునేందుకు అమెరికా ఏ దేశంపైనైనా విరుచుకు పడుతుందనిఉ ట్రంప్ మరోసారి నిరూపించి చూపుతున్నారు.






