భారత్‌కు సుద్దులు చెప్పి ట్రంప్‌ ఏం చేస్తున్నారిప్పుడు?

Trump hypocrisy Iran war, Trump peace India, Khamenei Trump threat, US Israel Iran conflict, Trump Truth Social post, Iran Israel tensions, Trump double standards

అమెరికా గొప్పదనం ఏమిటంటే అదెప్పుడూ శాంతిస్థాపన కోసం తరచూ యుద్ధాలు చేస్తూనే ఉంటుంది.

ADVERTISEMENT

నాడు ఇరాక్‌పై దాడులు చేసి ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వేటాడి చంపిన తర్వాత కానీ అమెరికా యుద్ధం ముగించలేదు.

ఇప్పుడు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయుతొల్లా అలీ ఖమేనీని చంపిన తర్వాత కానీ యుద్ధం ముగియదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తేల్చి చెప్పగా, డోనాల్డ్ ట్రంప్‌ కూడా ఇంచుమించు అదే చెప్పారు.

ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్‌ నిన్న పెట్టిన ఓ పోస్టులో “ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు ఖచ్చితంగా తెలుసని, ఆయనని చంపాలనుకుంటే తమకు క్షణం పట్టదని కానీ ప్రస్తుతం ఆయనని చంపే ఉద్దేశ్యం తమకు లేదని, కనుక తమ సహనాన్ని పరీక్షించకుండా బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్‌ హెచ్చరించారు.

అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అధినేత ఖమేనీకి మరణ శాసనం వ్రాసేసినట్లే భావించవచ్చు.

భారత్‌-పాక్‌, రష్యా-ఉక్రెయిన్‌ దేశాలను యుద్ధం విరమించాలని హితవు పలికిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టడం, ఆ దేశాధినేతని చంపేస్తామని బహిరంగంగా హెచ్చరించడం తప్పుగా భావించడం లేదు.

ఎందువల్లనంటే, అమెరికా మీద కూడా దాడులు చేస్తామని ఖమేనీ బెదిరించడం లేదా దాడులు చేసేందుకు ఖమేనీ ప్రయత్నించి ఉండవచ్చు.

భారత్‌ మీద పాక్‌ గత 4 దశాబ్ధాలుగా ఉగ్ర దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా మూడున్నరేళ్ళుగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అయినా భారత్‌, ఉక్రెయిన్‌ దేశాలు యుద్ధం చేయడం సరికాదని, చర్చల ద్వారా శాంతి స్థాపనకు ప్రయత్నించాలని ట్రంప్‌ సుద్దులు చెప్పారు. అదే ట్రంప్‌ నేడు ఇరాన్‌పై యుద్ధానికి సిద్దం అయ్యారు. సాటి దేశాధినేత ఖమేనీని ఎక్కడ దాక్కున్నా చంపేయగలమని హెచ్చరిస్తున్నారు.

అంటే అమెరికా వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించేసి ఆ దేశాధినేతని మట్టుబెట్టేయవచ్చు. కానీ భారత్‌లో ఉగ్రదాడులు చేసి వందల మందిని బలిగొన్న ఉగ్రవాదులు పాక్‌లో ఆశ్రయం పొందుతున్నారని తెలిసి ఉన్నా భారత్‌ చేతులు ముడుచుకు చూస్తూ కూర్చోవాలి తప్ప వారిని ఏమీ చేయకూడదు. చేస్తే ట్రంప్‌కి నచ్చదు.

ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే, మూడున్నరేళ్ళు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇరాన్‌-ఇజ్రాయెల్ చర్చల ద్వారా సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలకడం! అంటే ఎదుటవారికి చెప్పేటందుకే నీతులు. అవి తమకు వర్తించవన్న మాట!

ADVERTISEMENT
Latest Stories