కుటుంబంలో ఒక్కసారి తేడాలు వస్తే… అవి ఎంతటి కలహాలను సృష్టిస్తాయో మరోసారి నిరూపణ అవుతోంది. బుల్లితెర నటి శ్రీవాణి తన ఇంటిని కూలగొట్టిందని ఆమెకు వదిన అయినటువంటి అనూష పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానిపై తాజాగా మీడియా సాక్షిగా శ్రీవాణి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ‘తన అన్న చనిపోతే చూసేందుకు మాత్రమే వెళ్ళానని, చూసి వచ్చేస్తున్న సమయంలో తన వదిన, వాళ్ళమ్మ జుట్టు పట్టుకుని తనపై చేయి చేసుకున్నారని, అయినా తానేమీ అనలేదని’ చెప్పుకొచ్చింది.
‘ఇంటి కూల్చివేతలో తన ప్రమేయం లేదని, సంవత్సరం క్రితమే ఆ ఇంటిని తన పెద బావ వారి కూల్చివేసారని, ఆస్తుల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం తనకు లేదని, అది తన తండ్రి ఆస్తి అని, నాకు రంగారెడ్డి జిల్లా, పరిగిలో ఎలాంటి ఆస్తి ఉందని నిరూపణ అయినా, అది తన వదినకే రాసి ఇచ్చివేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలిపింది. ఇదిలా ఉంటే, తనకున్న ఆస్తిని తన కూతుళ్ళు, కొడుకులకు సమానంగా పంచిపెడుతున్నట్లు శ్రీవాణి తండ్రి చెప్పారు.
ఇదిలా ఉంటే, విచారణకు హాజరు కాని శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల పేర్కొన్నారు. తన అన్న భార్యపై దాడి చేసిన కేసు విషయమై విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆమె హాజరు కాలేదని, షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నానని చెప్పిందని అన్నారు. అయితే ఈ విచారణకు రాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టు తప్పదని హెచ్చరికలు జారీ చేసారు.



