ఆయన పెట్టిన చిచ్చుతో కొట్టుకుచస్తున్న ఆ రెండు పార్టీలు

Eatala Rajenderరాజకీయం అంటేనే ఒక పద్మవ్యూహం లాంటిది. అలాంటి రాజకీయ రణక్షేత్రంలో నెట్టుకురావాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిందే. లేకుంటే ఖేల్ ఖతం అయిపోయినట్లే. రాజకీయ క్రీడను బాగా ఒంటబట్టించుకున్న ఆ పెద్దాయన వేస్తున్న ఉచ్చులో బడా పార్టీలు సైతం బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో ఆ పెద్దాయనకు ఎదురేలేకుండా పోతుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అత్యంత రసవత్తరంగా మారింది. గులాబీ బాస్ గూగ్లీలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బిజేపీ పార్టీలు క్లిన్ బౌల్డ్ అవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య వైరాన్ని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుని తెలంగాణ లో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ADVERTISEMENT

ఇటీవల కాంగ్రెస్, బీజేపీలు బిఆర్ఎస్ మీతో దోస్తీ చేస్తుందంటే, మీతో దోస్తీ చేస్తుందంటూ ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో జతకట్టడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి 25 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈటల చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కాంగ్రెస్, బిఆర్ఎస్ కలయిక వల్ల బాగా నష్టపోయే వ్యక్తుల్లో రేవంత్ రెడ్డే ముఖ్యుడని, రేవంత్ సి.యం కుర్చీపై చాలా ఆశలు పెట్టుకున్నారని, కాంగ్రెస్ బిఆర్ఎస్ పొత్తువల్ల రేవంత్ ఆశలు అడియాశలు అవుతాయని, అది గ్రహించే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈటల ఘాటుగానే విమర్శించారు. ప్రజల కోసం ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన చరిత్ర తమదైతే, ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదని ఈటల అన్నారు.

తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ కూడా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు వేరువేరుకాదని, ఆరెండూ ఒక్కటేనని అన్నారు. జాతీయ స్థాయిలో జతకట్టి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రణాళికలు రచిస్తూ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ విమర్శలు చేశారు. ఎంతమంది కలిసి ఎన్ని కుట్రలు చేసినా మూడో సారికూడా మోడీ ప్రభుత్వం రావడం ఖాయమని సంజయ్ అన్నారు.

ఇక బీజేపీ విమర్శలకు టి.కాంగ్రెస్ నాయకులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇచ్చారు. తన పాత బాస్ అయిన కేసీఆర్ కోసం ఈటల తాపత్రయ పడుతున్నారని, మరోసారి తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకునిరావడానికి ఈటల మరియు బీజేపీలు బాగానే కష్టపడుతున్నాయని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బిఆర్ఎస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుని పైకి ఏమి తెలియనట్లు నటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ని దెబ్బతీయడానికే బీజేపీ, బిఆర్ఎస్ లు రహస్య ఒప్పందాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా ఈసారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని భట్టి అన్నారు.

తెలంగాణ లో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్, బీజేపీలు ఎలా విఫలమయ్యాయి అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బిఆర్ఎస్ శ్రేణులకు ప్లాన్ కూడా ఇచ్చారట. అంతేకాకుండా మరోసారి బిఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి రావాలో, తొమ్మిదేళ్ళ పాలనలో చేసిన ప్రగతి ఏంటో, రాబోయేరోజుల్లో తెలంగాణ ను ఏవిధంగా రూపుదిద్దబోతున్నారో అనే అంశాల్ని కూడా ప్రజలోకి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.

కేసీఆర్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎవరితోనైనా జత కడతారు, ఆయన చతురత ముందు ఏ పార్టీ కూడా ఆయనకు ఎదురు నిలవలేదు అని తెలంగాణ ప్రజానీకం చర్చించుకుంటుంది.

ADVERTISEMENT
Latest Stories