వైసీపీ కోసం ఉడత సాయం చేస్తున్న ఉండవల్లి…

Undavalli Arun Kumar speaking about YSRCP and Jagan political strategy in Andhra Pradesh

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానమో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ అడగక పోయినా, వైసీపీ కి అవసరం లేకపోయినా వారి రాజకీయ శ్రేయస్సు కోసం ఎప్పుడు ఎదో ఒక సలహతోనో, సూచనతోనో మీడియా ముందుకొస్తారు, తన గళం వినిపిస్తారు.

తాజాగా జగన్ మావిగన్ ప్రకటనతో రాబోయే ఎన్నికలలో వైసీపీ రాజకీయ పరిస్థితి ఏంటి అనే దాని పై అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో మావిగన్ ప్రకటన పై జగన్ మీద దారునమైన ట్రోలింగ్ కూడా నడుస్తుంది.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్దత లభించిన అంశం మీద స్పందించకుండా, అందుకు చక్రం తిప్పిన బాబు రాజకీయ వ్యూహాల పైనా మాట్లాడకుండా, జగన్ మావిగన్ ప్రకటన మీద తన అభిప్రాయాన్ని చెప్పకుండా రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలవాలంటే ఎం చెయ్యాలో చెపుతూ పరోక్షంగా జగన్ శ్రేయస్సు కోసం వైసీపీ మేలు కోసం తనవంతు సలహాలతో ఉడత సాయం చేస్తున్నారు ఉండవల్లి.

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల రాజకీయ బంధం ఇలానే కూటమి ద్వారా ముందుకెళితే రానున్న రోజులలో జగన్ 2.0 అంటూ కలలు కంటున్న వైసీపీ ఆశలన్నీ పగటి కలలు గానే మిగిలిపోతాయని, కూటమి లో చీలిక వస్తే తప్ప జగన్ కు ముఖ్యమంత్రిగా మరో ఛాన్స్ ఉండదని కుండబడ్దలు కొట్టారు ఉండవల్లి.

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలని, మూడు పార్టీల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా, వచ్చినా వాటిని అంతర్గతంగా చర్చించుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, మూడు పార్టీల రాజకీయ పొత్తు రాష్ట్ర అభివృద్ధికి తొలి మెట్టు అంటూ పదేపదే మూడు పార్టీల శ్రేణులకు స్పష్టంగా వివరిస్తున్నారు.

అటు సీఎం బాబు, మంత్రి లోకేష్ సైతం పవన్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ మూడు పార్టీల రాజకీయ బంధాన్ని మరికొన్నేళ్లు ఇలానే ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఉండవల్లి మీడియా ముందుకొచ్చి ఈ కూటమిని చీలిస్తే కానీ వైసీపీ కి రాజకీయ మనుగడ ఉండదని, జగన్ కు అధికారం అందదని, కాబట్టి వైసీపీ 2.0 కావాలి అంటే బాబు – పవన్ ల బంధం విచ్ఛిన్నం ఒక్కటే మార్గం అంటూ జగన్ కి ఉచిత సలహా ఇస్తున్నారు.

జగన్ రాజకీయ శ్రేయస్సు కోసం, వైసీపీ రాజకీయ లబ్ది కోసం ఇంతలా ఆరాటపడే ఉండవల్లి జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదో.? వైసీపీ కోసం ఇంతలా పరితపించే ఉండవల్లి ని జగన్ ఎందుకు తన పార్టీకి సలహాదారుగా నియమించుకోలేదో ఇప్పటికి ఏపీ రాజకీయాలలో జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.

గతంలో అంబటి అరెస్టు విషయంలో కూడా ఉండవల్లి కూటమి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఈ అరెస్టు అంబటి రాజకీయ భవిష్యత్ కి వైసీపీ రాజకీయ లబ్ది కి మేలు చేస్తుందంటూ తెగ ఆవేశపడ్డారు. మరి వైసీపీ కోసం ఉండవల్లి ఇచ్చిన ఈ సలహాను జగన్ రానున్న రోజులలో ఆచరణలో పెట్టనున్నారా అంటే అటువంటి ప్రయత్నాలు ఎన్నో వైసీపీ ఇప్పటికే అమలు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి.

ఈ మూడు పార్టీల కూటమిని చీల్చడానికి వైసీపీ రెండగులు ముందుకేస్తే, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి బాబు, పవన్, లోకేష్ ఎనిమిది అడుగులు ముందుకెళ్తూ వైసీపీ ప్రయత్నాలను నాలుగడుగులు వెనక్కి లాగుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో వైసీపీ రాజకీయం ఇంకా ఎన్ని రూపాలు మార్చికుని ప్రయాణం చేస్తుందో, ఉండవల్లి జగన్ కోసం ఇంకెన్ని సలహాయిస్తారో అని..!

ADVERTISEMENT
Latest Stories