టిడిపితో జనసేన పొత్తుపెట్టుకోకూడదని జగన్ కోరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేసేలా చేశారు. ఆ తర్వాత వారిరువురినీ విడగొట్టేందుకు మూడు పెళ్ళాలు, కాపు జాతి తాకట్టు అంటూ ఎంతగా దుష్ప్రచారం చేసినా ‘ఫెవీకాల్’తో అంటించిన్నట్లు ఆ రెండు పార్టీలు అంటుకుపోయాయి. అదే డేంజర్ అనుకుంటే వాటితో బీజేపీ కూడా జత కట్టడంతో వైసీపికి మూడింది.
ఇక చేసేదేమీలేక జగన్ చేతులు పిసుక్కొంటూ అదును కోసం వాటి ప్రభుత్వాన్ని చూస్తూ కూర్చున్నారు. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి, పోలీస్ శాఖలపై సంచలన వ్యాఖ్యలు చేయగానే వైసీపి టక్కున క్యాచ్ చేసి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ అదీ ఫలించలేదు.
ఏదో రోజు ఏదో విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మద్య విభేధాలు మొదలవుతాయని, కూటమి ప్రభుత్వం ప్రభుత్వం విచ్ఛిన్నం అవుతుందని జగన్, వైసీపి ఓపికగా ఎదురుచూస్తుంటే పవన్ కళ్యాణ్ మరో బాంబు పేల్చారు.
నిన్న శాసనసభలో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు వంటి అనుభవశాలి మార్గదర్శనం రాష్ట్రానికి, మా అందరికీ చాలా అవసరం. ఆయన ఈ 5 ఏళ్ళు మాత్రమే కాదు మరో పదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన నేతృత్వంలో అందరం పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము,” అని అన్నారు.
ఇది జగన్ ఎంత మాత్రం ఊహించని పరిణామమే. ఇంకా చెప్పాలంటే జగన్కి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా అడిగితే, కాసేపు చేతులు పిసుకున్నాక “ఎవరు సిఎంగా ఉంటారనేది వారు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు వాళ్ళని ఆశీర్వదించే దానిని బట్టి ఉంటుంది,” అని చెప్పారు.




