కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ నిన్న విజయవాడ వచ్చారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు చదివాక అసలు బీజేపీ అంటే ప్రజలు అసహ్యించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఏపీకి ఇస్తే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అడుగుతాయి అన్నారు సరే.
కానీ అసలు మోదీ ప్రత్యేక హోదా హామీ ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. డబ్బు పంపిస్తాం.. ఖాతా నెంబరు పంపమంటే రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు అని అన్నారు. అంతటితో ఆగకుండా నాలుగేళ్లు మీపై నమ్మకంతో ఎదురుచూసినా ఫలితం లేనందునే బయటికి వచ్చినట్లు టీడీపీ చెబుతోంది అని పాత్రికేయులు అంటే… అలా కాదు. ఇంకా వేచి చూడాల్సింది అని ఆయన అన్నారు.
పోనీ ఇంకెంత కాలం వేచి చూడాలి? అని అడిగితే నిర్లజ్జగా ఇంతకాలం అని ఏమీ లేదు. వేచి చూడడమే. రాజ్యాంగంలో ఇంతకాలం వేచిచూడాలని నిర్దిష్టంగా లేదు అని చెప్పారు. పోనీ ప్యాకేజీకింద ఇప్పుడు డబ్బులిస్తామంటారా? అని వారు అడిగితే ఆర్థికమంత్రిని అడగాలి అని చెప్పుకొచ్చారు మంత్రిగారు. ఇటువంటి వ్యవహారశైలి పద్దతితో బీజేపీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది ఇక్కడ అనేది మరో ప్రశ్న.



