వంగవీటి కుటుంబాన్ని కూడా జగన్‌ చీల్చబోతున్నారా?

Vangaveeti Asha Kiran Signals Entry into Andhra Politics

ఏపీ రాజకీయాలలో పరిచయం అవసరం లేని రాజకీయ కుటుంబాలలో వంగవీటి కుటుంబం ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై ఆ కుటుంబం ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. వంగవీటి కుటుంబంలో దాదాపు ప్రతీ ఒక్కరికీ రాజకీయ నేపధ్యం ఉంది. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.

ఈరోజు ఉదయం ఆమె విజయవాడలో తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కుటుంబ బాధ్యతల కారణంగా కొంత కాలంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనలేకపోయాను. రాధా రంగా మిత్రమండలికి దూరంగా ఉండిపోయాను. ఇకపై రాధా రంగా మిత్రమండలి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను. నగర ప్రజలకు అందుబాటులో ఉంటాను.

ADVERTISEMENT

మా కుటుంబం కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలను సమానంగానే చూస్తుంది. కనుక ఎవరికీ ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.

నేను, నా సోదరుడు రాధా వేర్వేరు దారులలో ప్రయాణిస్తున్నప్పటికీ మా ఇద్దరి ఆశయం మా తండ్రిగారి అడుగు జాడలలో నడవడమే. వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిన మాట నిజమే. కానీ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు,” అని అన్నారు.

ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్‌, ప్రజారాజ్యం, వైసీపీల తర్వాత 2019లో టీడీపిలో చేరి దానిలోనే కొనసాగుతున్నారు. ఒకవేళ వంగవీటి ఆశా కిరణ్ వైసీపీలో చేరితే ముందుగా వంగవీటి కుటుంబంలోనే రాజకీయ చీలిక ఏర్పడుతుంది.

2024 శాసనసభ ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌, టీడీపితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా వారి కూటమికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ తదితరులు కూడా మద్దతు లభించింది.

అందువల్ల కాపు సామాజిక వర్గం కూడా కూటమికి మొగ్గు చూపుతుందని వైసీపీ అధినేత జగన్‌ గ్రహించారు. కనుక రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు వారి నాయకుడు ముద్రగడ పద్మనాభంని ఎన్నికలకు ముందు హడావుడిగా పార్టీలో చేర్చుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని పిఠాపురంలో ఓడించే టాస్క్ అప్పగించారు.

జగన్‌తో అంటకాగడం వలన ఆయనకు ఎటువంటి దుస్థితి ఏర్పడిందో అందరికీ తెలుసు. ఆయనొక్కరే కాదు… వైసీపీతో అంటకాగిన పలువురు నేతలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు అటువంటి దుస్థితే ఎదురయింది.

చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షతో తమని వేధిస్తున్నారని జగన్‌, వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నప్పటికీ, దుష్ట సాంగత్యం, తప్పుడు పనుల వలననే వారు సమస్యలలో చిక్కుకుంటున్నారని అందరికీ తెలుసు.

ఉదాహరణకు అక్రమాస్తుల కేసులు, వివేక హత్య, మద్యం కుంభకోణం, తిరుమల కల్తీ నెయ్యి, పరకామణిలో దొంగతనం, తాజాగా తితిడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌ హత్య… ఇలా చాలానే ఉన్నాయి. ప్రతీ కేసులో వైసీపీ నేతలు లేదా వారితో అంటకాగుతున్నవారు సమస్యలలో చిక్కుకుంటూనే ఉన్నారు.

కనుక వంగవీటి ఆశా కిరణ్ ఆచి తూచి అడుగు వేయడం చాలా మంచిది. లేకుంటే రాధా రంగా మిత్రమండలి ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వలన పొందుతున్న గౌరవ మర్యాదలకు భంగం కలుగవచ్చు.

ADVERTISEMENT
Latest Stories