విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ నేతలు నిర్వహించిన పెద్ద నోట్ల రద్దుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బ్లాక్ మనీ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల డబ్బు ఉందని, అక్కడి నుంచి డబ్బును ఆగమేఘాల మీద తీసుకురండని కొందరు ఉచిత సలహాలిస్తున్నారని, అయితే బ్యాంకుల నుంచి డబ్బు తీసుకురావడం అంత తేలిక కాదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ విమానంలో స్విస్ బ్యాంకుకు వెళ్లి ‘డబ్బు ఇచ్చేయండి’ అనగానే వారు తల ఊపుతూ వెంటనే ఇచ్చేస్తారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు తలుపులు తెరిచి పెట్టుకొని ఉండబోవని ఎద్దేవా చేసిన వెంకయ్య, బ్యాంకుల్లో ఉంచిన ఖాతాదారుల డబ్బు వివరాలు గురించి ఏ మాత్రం చెప్పబోరని అన్నారు. మన బ్యాకుంల్లో ఉన్న ఖాతాదారుల వివరాలు చెప్పమంటేనే మన బ్యాంకర్లు చెప్పబోరని, ఇక విదేశాల్లో ఉన్న వారు మనకు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అయితే నల్లధనాన్ని రాబట్టడానికే స్విట్జర్లాండ్ ప్రభుత్వతో ఒప్పందం చేసుకున్నామని, అక్కడి నుంచి డబ్బు తెచ్చే ప్రక్రియ ఒక్క రోజులో అయిపోయేది కాదని అన్నారు.
విదేశాల్లో, దేశంలో ఉన్న నల్ల డబ్బంతా రాబడుతున్నామని, విదేశాల్లో ఉండే నల్లధనాన్ని తీసుకురావడానికి ఒప్పందాలు చేసుకుంటున్నామని, మరి దేశంలో ఉండే నల్లధనం ఎలా బయటకు తీయాలని ప్రశ్నించారు. అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజల్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై కూడా అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో వెయ్యి, ఐదు వేలు పదవేల నోట్లు ఉండేవని, అప్పుడు కూడా ఆ నోట్లను రద్దు చేశారని… కానీ, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని పెద్దనోట్ల రద్దుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
పెద్ద నోట్లను రద్దు చేసేముందే ప్రధాని మోడీ నల్లధనం ఉన్న వ్యక్తులకు 90 రోజులు టైమ్ ఇచ్చారని, వారి వద్ద ఎంత డబ్బు ఉన్నా చూపించాలని, దానికి పన్ను కట్టాలని చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు. పాకిస్థాన్, మాఫియా, టెర్రరిస్టులు, మావోయిస్టులను నిర్మూలించేందుకు, సమాంతర ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడుతున్న వారిని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ టీవీలో చేసిన ప్రకటన పూర్తయ్యే వరకు మేము సమావేశ మందిరం నుంచి బయటకు రాలేదు. ఇంత పద్ధతిగా మోడీ అన్ని వ్యవహారాలను చేస్తే తొందరపాటు చర్య అని విమర్శించడం తగదని అన్నారు.



