కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు అంగీకరించకపోయినా నేడు జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలందరూ రోడ్లపైకి వచ్చి చాలా ఉత్సాహంగా వెన్నుపోటు పొడిచారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సభలకి, గడప గడపకి వంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపేవారు కారు.
కానీ ఇప్పుడు అందరూ పూనకం వచ్చినట్లు రోడ్లపైకి వచ్చేసి కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా విఫలం అయ్యారని గలగల మాట్లాడేస్తున్నారు.
ఇంత కాలం కేసుల భయంతో కలుగులో ఎలుకల్లా దాగున్న వైసీపీ నేతలందరూ ఇవాళ్ళ ఇంత ధైర్యంగా, ఉత్సాహంగా వెన్నుపోటు పొడిచేందుకు ముందుకు రావడం చాలా ఆశ్చర్యకరమే.. ఇది తప్పకుండా జగన్కు చాలా ఉపశమనం కలిగించే విషయమే!
పార్టీ నేతలు ఇంత ఉత్సాహంగా రోడ్లపైకి వస్తారని జగన్ ఊహించి ఉండరు. ఉంటే ఆయన కూడా తప్పకుండా వారితో కలిసి వెన్నుపోటులో పాల్గొనేవారు. కనుక జగన్ ప్రజల మద్యకు వచ్చేందుకు ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారని చెప్పక తప్పదు.
ఇక్కడ మూడు విషయాల గురించి ఆలోచించాలి.
వైసీపీ నేతలందరూ కూడబలుకున్నట్లు ఈ మండే ఎండలలో వెన్నుపోటుకి ఎందుకు వచ్చారు?
ఇలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు జగన్ ఎందుకు పాల్గొనలేదు?
కూటమి ప్రభుత్వం తమని అణచివేస్తోందని వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నప్పుడు, వైసీపీలో అందరూ ఇంత స్వేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసుకోగలిగారు కదా?
కేసుల భయంటో వైసీపీ నేతలు ఇళ్ళలో నుంచి బయటకు రాకపోతే పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఒకసారి వారు పార్టీకి దూరం అయితే మళ్ళీ వెనక్కు రప్పించుకోవడం చాలా కష్టం. కార్యకర్తలు లేకుండా నేతలు ఏమీ చేయలేరు.
కనుక వారిలో ఉత్సాహం నింపేందుకు వెన్నుపోటు చాలా అవసరమని, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది కానీ ఇప్పుడు చెల్లదని జగన్ గట్టిగా చెప్పినందున అందరూ కలుగుల్లో నుంచి బయటకు వచ్చి ఉండవచ్చు.
జగన్ ప్రాణ భయంతో బయటకు రావడం లేదని కొందరు భావిస్తుంటే, అరెస్టు భయంతోనే బయటకు రావడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిలో ఏది నిజమో వైసీపీ నేతలే చెప్పాలి.
రాష్ట్రంలో వైసీపీ ఇంత స్వేచ్ఛగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసుకోవడమే తమ నిష్పక్షపాత ధోరణికి చక్కటి నిదర్శనమని కూటమి నేతలు చెప్పుకోకపోవడం మైనస్ పాయింటే కదా?




