రాజకీయ, సినీ సెలబ్రెటీలే లక్ష్యంగా జాతకాలు చెప్పే వేణు స్వామి ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి. నాగ చైతన్య, శోభిత వివాహ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన జోస్యాల పై కేసులు పెట్టే స్థాయికి పరిస్థితులు వెళ్లాయి.
అలాగే ఇటు పొలిటికల్ అంశాల పైన కూడా వేణు తన జోస్యాలు వివరిస్తుండే వారు. 2023, 24 ఎన్నికలలో అటు తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ కేటీఆర్ ని హై లైట్ చేసిన వేణు ఇటు ఏపీలో మరోసారి వైసీపీ అధికారం చేపడుతుందని, జగన్ జాతక చక్రం ప్రకారం జగన్ కు రెండోసారి ముఖ్యమంత్రి యోగం ఉందంటూ చెప్పుకొచ్చారు.
అలాగే జనసేన అధినేత పవన్ జాతక చక్రం ప్రకారం ఆయనకు పదవి అనేది అందని ద్రాక్షే అన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా రావడంతో ఆయన జోస్యానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇక ఇటు ఐపీఎల్ ను సైతం వదిలిపెట్టలేదు వేణు.
ఐపీల్ లో ఈ సారి ట్రోఫీ అందుకునే ఫ్రాంచైజీ ఎదో కూడా వేణు స్వామి తన దివ్య దృష్టితో చెప్పేసేవారు. కానీ ఫలితాలు మాత్రం ఆయన చెప్పినట్టుగా కనిపించేవి కాదు. అయితే జోస్యాలతో ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన వేణు తాజగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ అనిచ్చితి, వెస్ట్ బెంగాల్ లో రాబోయే పరిణామాల మీద కూడా తన నోటికి పనిచెప్పారు.
తమిళనాడులో విజయ్ టీవీకే దాదాపు ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమయ్యింది. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడంలో విజయ్ పూర్తిగా సక్సెస్ కాకపోవడంతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు తో అధికార పీఠం దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో విజయ్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా అధికార పీఠం అందుకున్నప్పటికీ ఆయన ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది లోపే ఉంటుందని, తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, విజయ్ త్రిష లది ఎకనాడి కాంబినేషన్ అని ఈ వ్యవహారంలో త్రిష పాత్ర లేకుంటే తమిళనాట ఎన్నికల ఫలితాలు వేరేగా ఉండేవని, విజయ్ పరిస్థితి కూడా మరోలా ఉండేదంటూ హాట్ కామెంట్స్ చేసారు.
అలాగే ఇటు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఘన విజయం విషయంలో కూడా స్పందిస్తూ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అతి పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగినప్పటికీ అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ జాతక చక్రం ప్రకారం ఆమె మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు.
మరి చూడాలి వేణు స్వామి జోస్యం ఎప్పటి మాదిరే కేవలం సంచనల కోసమేనా లేక ఆయన చెప్పిన వాటిలో ఏమైనా జరిగే అవకాశం ఉందా అనేది కాలమే సమాధానం చెప్పగలదు.




