జగన్-షర్మిల ఆస్తుల వివాదం మొదలైన తర్వాత ఆమె ప్రెస్మీట్ పెట్టి అన్నపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటం, అప్పుడు వైసీపి నాయకులు ప్రెస్మీట్లు పెట్టి వాటిని ఖండించి ఎదురుదాడి చేస్తుండటం ‘డైలీ సీరియల్’ అయిపోయింది.
జగనన్న తనని, తన బిడ్డలని మోసం చేసినందుకు తల్లి విజయమ్మ తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారని, తమ తండ్రి ఆత్మ ఎంతో క్షోభిస్తుందని వైఎస్ షర్మిల వాదిస్తున్నారు.
వైసీపి నేతలు కూడా ఆమె చంద్రబాబు నాయుడు ఆడమన్నట్లు ఆడుతున్నారని ఇందుకు వైఎస్ ఆత్మ తప్పకుండా క్షోభిస్తుందని వైసీపి నేతలు వాదిస్తున్నారు.
వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ‘వైఎస్ చావుకి చంద్రబాబు నాయుడే కారకుడు’ అని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో ఆమె కూడా ఈవిదంగా ఆరోపించారని కానీ ఇప్పుడు ఆయన చేతిలో పావుగా మారిపోయి జగన్ రాజకీయ జీవితాన్ని దెబ్బ తీసేందుకు ప్రెస్మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.
వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు, జగన్ సోనియా గాంధీ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు కారకుడని వాదిస్తున్నారు.
వైఎస్ కుటుంబంలో ఆస్తుల కోసం కీచులాడుకుంటూ వాటిని చంద్రబాబు నాయుడుకి అంటగట్టడమే తప్పు. మళ్ళీ ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం గీత దాటడంగానే భావించవచ్చు.
నిన్న వైఎస్ షర్మిల ప్రెస్మీట్లో మాట్లాడుతూ “అక్రమాస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డిని కాపాడాలంటే ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ పేరు ఛార్జ్ షీట్లో చేర్చడం చాలా అవసరమని భావించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి చేర్పించిన మాట వాస్తవం కాదా?
అందుకు బహుమతిగా ఆయనకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా? తనను తాను కాపాడుకోవడం కోసం తండ్రి పేరునే ఛార్జ్ షీట్లో చేర్పించిన జగన్, తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చడంలో వింతేముంది? జగన్, వైసీపి నేతల తీరు చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది,” అని అన్నారు.
కనుక మొత్తంగా చూస్తే జగన్, వైఎస్ షర్మిల, వైసీపి నేతల తీరుకి వైఎస్ ఆత్మ క్షోభిస్తోందని అర్దమవుతోంది. అంటే అందరూ కలిసి చనిపోయిన ఆయనను క్షోభ పెడుతున్నారన్న మాట!




