వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మీడియా ముందుకు వచ్చి చాలా మాట్లాడారు. దానిలో నం.2, కోటరీ, పాలేరు అంటూ చాలానే మాట్లాడారు. జగన్ శ్రేయోభిలాషిగా నాలుగు మంచి ముక్కలు చెపుతూనే, మిధున్ రెడ్డి, కసి రెడ్డి మద్యం స్కాం, కమీషన్లు అంటూ సామాన్య ప్రజలకు తెలియని చాలా విషయాలు చెప్పారు.
టీడీపి నేతలేవరైనా జగన్ని తమ పార్టీని పల్లెత్తు మాట అంటే మూకుమ్మడిగా విరుచుకుపడుతుంటారు వైసీపీ నేతలందరూ. కానీ విజయసాయి రెడ్డి ఇన్ని మాటలన్నా ఒక్కరూ స్పందించలేదు.
బహుశః తాడేపల్లి ప్యాలస్లో మేధోమధనం జరుగుతోందేమో? అయితే సజ్జల వగైరాల కోటరీని విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు కనుక దాని గురించి వారితోనే జగన్ చర్చిస్తే వైసీపీ స్పందన ఒకలా ఉంటుంది. కోటరీని పక్కన పెట్టి శ్రేయోభిలాషులతో చర్చిస్తే స్పందన మరోలా ఉంటుంది.
కానీ పేడ మీద రాయి వేస్తే మన మీదే తుళ్ళుతుందన్నట్లు రాజకోట రహస్యాలు తెలిసిన షర్మిల, విజయసాయి రెడ్డి వంటి వారి మాటలకు రెచ్చిపోయి ఆవేశంతో ఏదో మాట్లాడేస్తే వాళ్ళు మరిన్ని రహస్యాలు బయటపెట్టేసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మరిన్ని సంజాయిషీలు చెప్పుకోవాల్సి వస్తుంది.
కనుకనే షర్మిల గాల్లో ఎన్ని బాణాలు వేస్తున్నా పట్టించుకోవడం లేదనుకోవచ్చు. అలాగే విజయసాయి రెడ్డి విషయంలో కూడా మౌనం వహించక తప్పదు.
కానీ ఆయనని పార్టీలోకి తెచ్చుకొని నం.2 చేయాలనుకుంటే అత్యవసరంగా రేపోమాపో ఏదో మాట చెప్పక తప్పదు. లేకుంటే ప్లాన్ బీ ప్రకారం బిజేపిలోకి వెళ్ళిపోతారు.






