మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ రైల్వే, రవాణా శాఖపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆగష్టు నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విజయవాడ వైపుకు వెళ్లే రైళ్లు మరియు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లన్నీ అయిపోయి, వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత అయ్యింది. సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే గోదావరి, విశాఖ, సింహపురి, మచిలీపట్నం, గరీబ్ రథ్, ఇంటర్ సిటీ, పద్మావతి, చార్మినార్, గోల్కొండ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లన్నింటిలో ఆగస్టు రెండు, మూడు వారాల్లో రిజర్వేషన్ దొరికే అవకాశం లేదు.
ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 200 నుంచి 300కు పైగానే ఉంది. ఇక బస్సుల విషయానికి వస్తే, విజయవాడ మీదుగా తిరిగే 240 బస్సుల్లో ఇప్పటికే 40 శాతం బస్సుల్లో సీట్లు అయిపోయాయి. మరో 20 శాతం బస్సుల్లో వెనుక వైపు కొద్ది సీట్లు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయితే, ప్రత్యేక బస్సులు ప్రారంభిస్తామని అధికారులు వ్యాఖ్యానించారు. అనంతపురం, తిరుపతి, కడపలతో పాటు విశాఖ, రాజమండ్రి ప్రాంతాల నుంచి రాజధాని వైపు వెళ్లే బస్సులకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది.
పుష్కరాల్లో భక్తుల తాకిడి విజయవాడకే ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. కృష్ణానదిపైనే ఉన్న మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి పెద్దగా భక్తుల తాకిడి లేదు. అన్ని ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే బస్సుల్లో ఖాళీలు ఇంకా కనిపిస్తున్నాయి. బహుశా సమయం సమీపిస్తున్న కొద్దీ శ్రీశైలం కూడా కిటకిటలాడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు.



