జగన్ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, జనసేనలు పొత్తు కుదుర్చుకోకుండా అడ్డుపడేందుకు పవన్ కళ్యాణ్ని, కాపులను పదేపదే రెచ్చగొట్టేవారు. కానీ ఆ వ్యూహం ఫలించకపోవడంతో పవన్ కళ్యాణ్కి శాపనార్ధాలు పెడుతూ, కాపు జాతిని చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేస్తున్నారంటూ దుష్ప్రచారం చేశారు.
కానీ అదీ ఫలించలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ హోంమంత్రి, పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలని తెలివిగా ఉపయోగించుకుంటూ మళ్ళీ టిడిపి, జనసేనల మద్య చిచ్చుపెట్టేందుకు వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నించారు.
“చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ని ద్వితీయశ్రేణి పౌరుడిగా చూస్తున్నారని, టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పవన్ కళ్యాణ్ని అసలు పట్టించుకోవడమే లేదని, అందరూ మంత్రి నారా లోకేష్ చుట్టూనే తిరుగుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సాయం పొందిన నారా లోకేష్ కూడా ఇప్పుడు ఆయన మాట ఎవరూ వినొద్దని అధికారులకు చెపుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నారా లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని, కాపుజాతిని తొక్కిపెట్టేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న పాపాలే ఆయన కొడుకు నారా లోకేష్ని పాములై కాటేస్తాయంటూ విజయసాయి రెడ్డి శాపాలు పెట్టారు.
ఇటువంటి కపట ఆలోచనలు, కుట్రపూరితమైన వ్యూహాలను చూసే ప్రజలు తమని అసహ్యించుకొని గద్దె దించేశారని వైసీపి నేతలు నేటికీ గ్రహించలేదని విజయసాయి రెడ్డి మాటలు వింటే అర్దమవుతుంది.
ఏదోవిదంగా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేలా చేయగలిగితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సులువుగా విచ్ఛిన్నం చేయవచ్చని వైసీపి ఆలోచనలు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి మాటలతో అర్దం అవుతోంది.
ఆ ప్రయత్నంలో భాగంగానే నారా లోకేష్ ప్రస్తావన చేస్తూ పవన్ కళ్యాణ్ని ద్వితీయశ్రేణి పౌరుడిగా అభివర్ణిస్తూ ఆయనని, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలని, కాపులను విజయసాయి రెడ్డి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు.
ఈ ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ నిన్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడుతుండగా, ఆయన చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని వైసీపి సొంత మీడియాలో దుష్ప్రచారం చేసింది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత ప్రాధాన్యం, సముచిత గౌరవం ఇస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో తన ఫోటోతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా పెట్టించారు. పవన్ కళ్యాణ్ హోంమంత్రిని విమర్శిస్తే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి కారణాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు తప్ప ఆవేశంతో స్పందించలేదు.
టిడిపి, జనసేనల మద్య, ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల మద్య చిచ్చు పెట్టాలని వైసీపి నేతలు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ గట్టిగా తిప్పికొట్టకపోతే ఎడతెరిపి లేకుండా సాగుతున్న ఈ వైసీపి దుష్ప్రచారాలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంటుంది.




