వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రజలు, పార్టీ నేతల మద్య కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుంటారని అందరికీ తెలిసిందే. ఇవాళ్ళ ఆదివారం కావడంతో పగటికల ఏమైనా కన్నారో ఏమో దానిని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు.
“ప్రియమైన జెండా కూలీల్లారా… అంటూ మొదలుపెట్టి నేను కూడా మీలో ఒకడిని మనం ఎంత కష్టపడినా కూలీ మాత్రమే దక్కుతుంది తప్ప లాభాలలో కూలీలకు వాటాలు ఇవ్వరు. కనుక మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే, ఆయన ఆశ్సీసులతో నేను కేంద్రమంత్రిని అయితే కూలీలకు, కార్మికులకు లాభాలలో 10 శాతం వాటా ఇచ్చేలా చట్టసవరణ చేస్తా. దానిపై పన్ను మినహాయింపు కూడా ఇస్తాం,” అంటూ ట్వీట్ చేశారు. అయితే వైసీపి జెండా బదులు కార్మికులను సూచిస్తున్నట్లు ఎర్రజెండాలు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
విజయసాయి రెడ్డి వైసీపిలో ఉన్నప్పటికీ ఢిల్లీలో అన్ని పార్టీల పెద్దల పట్ల వినయవిధేయలతో మెసులుకుంటూ అందరినీ ప్రసన్నం చేసుకుంటారు. అందువల్లే ఆయన 11 అక్రమాస్తుల కేసులలో ఏ-2గా చంచల్గూడా జైలులో 16 నెలలు గడిపి బెయిల్ బయటకు వచ్చినప్పటికీ, ఎప్పటికప్పుడు పార్లమెంటులో ఏదో ఓ కీలక పదవి పొందుతూనే ఉంటారు.
కనుక ఇదే నేర్పుతో మెల్లగా బీజేపీలో చేరిపోయి కేంద్రమంత్రి అవుదామని ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. లేకుంటే ఇలాంటి అసందర్భ కబుర్లు చెప్పేవారే కారు కదా? కనుక ఆయన విషయంలో జగనే జాగ్రత్తపడటం మంచిదేమో?
అయినా వయసులో జగన్ కంటే చాలా పెద్దవాడైన విజయసాయి రెడ్డి జగన్ ఆశీసులతో కేంద్రమంత్రినవుతా అని చెప్పుకోవడం చూస్తే పదవి కోసం దేనికైనా రెడీ అన్నట్లున్నారు.




