మొదటి రోజు నాటౌట్ గా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో భారత్ స్కోర్ 400 మార్క్ ల మైలురాయి దాటగా, చివరి వరుస బ్యాట్స్ మెన్లు చెలరేగి ఆడడంతో ఏకంగా 566 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 302 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ఆరంభించగా, కోహ్లి సరిగ్గా 200 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న అశ్విన్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.
అశ్విన్ 113 పరుగులు చేసి అవుట్ కాగా, కీపర్ సాహా 40 పరుగులు, మిశ్రా 68 బంతుల్లో 53 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులెత్తింది. చివర్లో షమి కూడా రెండు సిక్సర్లు బాది తన వంతు సాయం చేసాడు. 8 వికెట్లే కోల్పోయినప్పటికీ, భారీ స్కోర్ నమోదు కావడంతో కోహ్లి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు 16 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. ఆ ఒక్క వికెట్ ను షమి సొంతం చేసుకోగా, చంద్రిక 16 పరుగుల వద్ద ఔటయ్యాడు.
విండీస్ పర్యటనను గ్రాండ్ గా ఆరంభించింది టీమిండియా. ఇక బౌలర్లు కూడా బ్యాట్స్ మెన్లు మాదిరి రాణిస్తే… మొదటి టెస్టులో విజయం సొంతం చేసుకోవడం భారత జట్టుకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కరేబియన్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ ను తమ వశం చేసుకోవాలని కోహ్లి సేన ఊవ్విళ్ళూరుతోంది.



