విశాఖ రాజధాని అంటూ జగన్ ప్రభుత్వం కబుర్లే తప్ప 5 ఏళ్ళలో నగరాభివృద్ధికి చేసిందేమీ లేదు. రాజధాని ఏర్పాటు చేయకపోయినా అందుకు తగ్గట్లుగా నగరాభివృద్ధి చేసి ఉన్నా జగన్, వైసీపి నేతల మాటలను ప్రజలను నమ్మేవారేమో కానీ కనీసం రోడ్ల మీదలు గుంతలు కూడా పూడ్చలేకపోయారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే విశాఖ అభివృద్ధిపై దృష్టిపెట్టగా, మంత్రి నారా లోకేష్ విశాఖకి ఐటి కంపెనీలు, పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలలో మెట్రో కూడా ఒకటి. విశాఖ నగరాన్ని నలువైపులా కలుపుతూ మెట్రో ఏర్పాటుకి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా మరో ప్రతిపాదనని కూడా ఓకే చేసిన్నట్లు సమాచారం. నగరంలో మొదటి దశలో కొమ్మాది జంక్షన్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ కారిడార్ మొత్తం జాతీయ రహదారి (ఎన్హెచ్-16) మీదుగానే సాగుతుంది. ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ వలన ఈ జాతీయ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఒకవేళ దానిపై మెట్రో కూడా నిర్మిస్తే ఇంకా ఇరుకుగా మారుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు సిఎం చంద్రబాబు నాయుడుకి తెలియజేసి, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
వారి సూచన చాలా సహేతుకంగా ఉండటంతో సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది. తానే స్వయంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రితో మాట్లాడి ఒప్పిస్తానని హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో కూడా ఇదే సమస్య ఏర్పడుతుంది కనుక అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లతో కూడిన మెట్రో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన్నట్లు తెలుస్తోంది.
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మించిన్నట్లయితే ఒకేసమయంలో పైన మెట్రో రైళ్ళు, కింద వాహనాలు వెళ్ళగలుగుతాయి. దీని వలన వాటి దిగువన రోడ్డుపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు మెట్రోతో పాటు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లని కూడా ఏర్పాటు చేయగలిగితే అవే ఆయనకు హైదరాబాద్ హైటెక్ సిటీలా జ్ఞాపికలుగా శాశ్వితంగా నిలిచిపోతాయి.




