గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. అయితే ప్లాంట్ ప్రావేటీకరణను అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి కార్మికుల వరకు విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమాలు సాగించారు.
ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలకు రాజకీయ పార్టీలు కూడా తమవంతు గా సంఘీభావం ప్రకటించాయి. అయితే 2024 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ నుంచి రక్షించి యధావిధిగా కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చారు.
అయితే వారిచ్చిన హామీకి తగ్గట్టే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కి గాను కేంద్రం నుంచి భారీగా నిధులు సైతం వెలువడుతున్నాయి.
గత ఏడాది స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్రంతో కూటమి ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల మేరకు 11440 కోట్ల ప్యాకేజ్ అందించింది. ఇందులో 10300 కోట్లు ఈక్విటీ రూపంలో మరో 1140 కోట్లు వర్కింగ్ కాపిటల్ రుణాల రూపంలో సమకూర్చింది.
ఇక తాజాగా ఇప్పుడు మరో 8097 కోట్ల ఆర్థిక సాయం అందించేందు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబందించిన ఫైల్ ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర కోసం పంపినట్లు సమాచారం.
దీనితో నాడు అసలు విశాఖ స్టీల్ ప్రవేటీకరణ కాకుండా ఉంటుందా.? కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి ఢిల్లీ పెద్దలు వెనక్కి వెళ్తారా.? విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గౌరవిస్తారా.? అనే అపనమ్మకంతో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులు విడుదల కావడం తో తమ అభద్రతా భావానికి ముగింపు పలికినట్టవుతుంది.




