టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పగబట్టి వరుసపెట్టి కేసులు నమోదు చేయిస్తున్నారు. వారిమద్య రాజకీయ వైరం, ఆధిపత్యపోరు సాగుతోంది కనుక జగన్ ఈ విదంగా వ్యవహరించడం సహజమే. కానీ మాజీ కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడుపై ఎందుకు పగబట్టారో అర్దం కాదు.
ఒకవేళ ఆయన వైసీపిలో చేరి ఉంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొన్నాక ఏ పార్టీలోను చేరలేదు. కానీ అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెట్టి రాజకీయాలపై, నాయకులపై తన అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అప్పుప్పుడు కోర్టులలో కేసులు కూడా వేస్తుంటారు. ఇదివరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై కేసు వేసిన ఆయన తాజాగా చంద్రబాబు నాయుడుపై కూడా రాష్ట్ర హైకోర్టులో ఓ ప్రజాహిత పిటిషన్ వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ.241 కోట్లు అవినీతి జరిగిందని, ఈ కేసును సీబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన ప్రజాహిత వాజ్యం వేశారు. ఈ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, ఈడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఐడి, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, షాబాద్కు చెందిన గంటా సుబ్బారావు సన్ ఆఫ్ వెంకట రామయ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ పిటిషన్ వేసినా దీని వలన చంద్రబాబు నాయుడికే మేలు కలుగుతుందని చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతోనే ఈ అక్రమ కేసులను సృష్టించి వేధిస్తోందని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో సహా టిడిపి నేతలందరూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. కనుక జగన్ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే ఏపీ సీఐడీ పోలీసుల చేతిలో నుంచి ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళితే అది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చే అవకాశం ఉంటుంది.
కోడికత్తి కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దానిలో ఎటువంటి కుట్ర లేదని తేల్చేసిన్నట్లే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సీబీఐ చేతికి వెళితే దీనిలో నిజంగా అవినీతి జరిగిందా, ఆ పేరుతో జగన్ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందా?అనే విషయం బయటపడుతుంది.



