ఇదివరకు జగన్ని ప్రసన్నం చేసుకొని మంత్రి పదవులు, ఎన్నికలలో టికెట్స్ సంపాదించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు పోటాపోటీగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అవహేళన చేస్తుండేవారు.
నాకు మీపై నమ్మకం కలగాలంటే వారిని తిట్టి నిరూపించుకోవాలని జగన్ తమకు చెప్పేవారని వైసీపిని వీడిన పలువురు నేతలు చెపుతుంటారు. చివరికి వైసీపిలో అదే ప్రధాన అర్హతగా మారిపోయింది. వారి పట్ల ద్వేషం, అసహ్యమే వైసీపి విధానాలుగా మార్చేసుకున్నారు కూడా.
కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవడంతో వైసీపి నేతల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా షర్మిల, విజయమ్మ ఇద్దరూ ఆస్తుల విషయంలో జగన్ తమని మోసం చేశాడని బహిరంగ లేఖ వ్రాయడం, దానికి జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా, సొంత మీడియా చేత, తమ చేత వారిరువురినీ తిట్టిస్తుండటంతో అందరూ పునరాలోచనలో పడ్డారు.
ఈ వ్యవహారంలో వేలకోట్ల ఆస్తులు పంచి ఇవ్వకుండా తప్పించుకోగలిగితే ఆ మేరకు ఆయన ఆర్ధికంగా లాభపడతారు. కానీ ఆయనకు వంతపాడుతుంటే ప్రజలు, ముఖ్యంగా మహిళలకు తమ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందని అప్పుడు నష్టపోయేది తామే అని వైసీపిలో చాలా మంది గ్రహించారు.
వైసీపి మునిగిపోయే ఓ టైటానిక్ షిప్ అని, దాని కెప్టెన్ జగన్ ఎవరి మాట వినకుండా ముంచేయబోతున్నాడని గ్రహించినవారు ఎన్నికలకు ముందే ఆ పార్టీలో నుంచి జంప్ అయిపోయారు.
జగన్ని నమ్ముకుని చేతులు కాల్చుకున్న వారిలో మరికొంత మంది ఎన్నికల తర్వాత టిడిపి, జనసేనల్లో చేరిపోయారు.
ఇప్పుడు షర్మిల-జగన్ ఆస్తుల భాగోతం మొదలైన తర్వాత మరికొందరు వైసీపి నేతలు గోడ దూకేస్తున్నారు. మరికొందరు సిద్దంగా ఉన్నారు.
ఆనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను తిట్టిపోసిన నేతలే ఇప్పుడు తమని టిడిపి లేదా జనసేనలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తామని హామీ ఇస్తున్నారట!అంటే వైసీపిలో నేర్చుకున్న ఈ దురలవాటు మానుకోలేకపోతున్నారన్న మాట!
ఇటీవల వైసీపికి రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అదే చేస్తున్నారిప్పుడు.
ఆనాడు ఆమె మహిళా కమీషన్ ఛైర్ పర్సన్గా ఉన్నప్పుడు గంట అరగంట అనే మంత్రులని నిలదీయలేదు. డర్టీ పిక్చర్తో ఓవర్ నైట్ స్టార్ అయిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఆ వీడియో గురించి ప్రశ్నించలేదు.
కానీ ఇప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అత్యాచార బాధితుల పేర్లను ఆయన బయట పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అంటే జగన్ని తిట్టిపోసి నిబద్దత నిరూపించుకున్నారు కనుక టిడిపి, జనసేనలో చేరేందుకు మార్గం సుగమం అవుతుందని చెపుతున్నట్లు భావించాలేమో?




