నరేంద్ర మోడీ తొలిసారిగా 2014, మే 26న ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఎర్రకోటపై జండా ఎగరేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచే దేశంలో ఒక్కో రాష్ట్రంలో బిజేపిని గెలిపించుకుంటూ కాషాయ జెండాలు ఎగరేస్తున్నారు.
ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కంచుకోట పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ జెండా ఎగరేయాలని చాలా పట్టుదలగా, చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో కూడా బిజేపి అధికారంలోకి రాగలిగితే 2029 లోక్సభ ఎన్నికల నాటికి మరింత బలపడి వాటిలో కూడా సునాయాసంగా గెలవగలదు.
దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. కనుక బెంగాల్లో 294 శాసనసభ, 42 లోక్సభ సీట్లున్నాయి. 294 నియోజకవర్గాలలో బిజేపి మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తే ఆ మేరకు రాజ్యసభలో కూడా బిజేపి బలం పెంచుకోవచ్చు. అందుకే ప్రధాని మోడీ, అమిత్ షాలు పశ్చిమ బెంగాల్పై ప్రత్యేక దృష్టి పెట్టి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 23న మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరుగగా, నేడు మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
బెంగాల్ నుంచే బిజేపి పతనం ప్రారంభం అవుతుందని, ఎన్నికలలో గెలిచిన తర్వాత ఢిల్లీకి వచ్చి మిత్ర పక్షాలను కూడగట్టి వచ్చే లోక్సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని సిఎం మమతా బెనర్జీ శపథం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా బిజేపిని, మోడీ పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కనుక బెంగాల్లో బిజేపి మళ్ళీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని దాని వ్యతిరేక శక్తులన్నీ ఏకం అయ్యే అవకాశం ఉంది. కనుక దేశ రాజకీయాలను బెంగాల్ ఎన్నికల ఫలితాలు మలుపు తిప్పే అవకాశం ఉంది.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు మీడియా సంస్థలు సిద్దంగా ఉన్నాయి. అవి వెలువడితే అస్సోం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అన్ని పార్టీల జాతకాలు తెలుస్తాయి. మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కనుక ఆ రోజున పూర్తి స్పష్టత వస్తుంది.




