నేడు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు 61.11 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఈ లెక్కన పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసే సరికి మరో 20-30 శాతం నమోదైనా ఆశ్చర్యం లేదు. మొదటి దశలో కూడా సుమారు 90 శాతం పోలింగ్ నమోదైంది.
విశేషమేమిటంటే ఈ ఎన్నికలకు ముందు ఎన్నికల కమీషన్ ‘సర్’ పేరుతో ఏకంగా 96 లక్షల ఓట్లు తొలగించింది. అవన్నీ తమ మద్దతుదారుల ఓట్లే అని, బిజేపి తనని ఎన్నికలలో నేరుగా ఎదుర్కోలేక ఎన్నికల కమీషన్ సాయంతో తమ ఓట్లు తొలగించి దెబ్బ తీయాలని కుట్ర చేసిందని సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ఇంకా విశేషమేమిటంటే ఏకంగా 96 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత కూడా 90 శాతం పోలింగ్ జరగడం. దీనిపై కూడా సిఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘రాష్ట్రంలో భారీగా రిగ్గింగ్ జరుగుతోందని’ ఆరోపించారు. అంటే ఈసారి ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని ఆమె గ్రహించినట్లే ఉన్నారు.
అవునో కాదో సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడితే తెలుస్తుంది. మే 4న ఫలితాలు వెలువడినప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది.




