కమలం పార్టీలో బలమైన నాయకుడెవరు?

Who is the strongest leader in BJP Partyప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న మెూడీ, దేశ రాజకీయాన్ని కనుసైగలతో శాసిస్తున్న షా ద్వయాన్ని ఎదురుగా ఉంచుకుని ‘ఇదేం పచ్చి ప్రశ్న’ అంటారేమెూ. అది నిజమే కావచ్చు, కానీ ఆంధ్రా బిజేపిని చూసాక కూడా అదే మాట అంటారేమెూ చూడాలి. విషయానికి వస్తే రెండేళ్ళ ముందు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత సోము వీర్రాజు గారిని ఆంధ్రా బిజేపి అద్యక్షలుగా పార్టీ నియమించింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పైన, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపైన ఒంటికాలిపై సజ్జికల్ స్ట్రైక్ చేసిన ఊపు చూసి ఈయనకు పగ్గాలిస్తే పార్టీని ముంగాళ్ళ మీద పరిగెత్తిస్తారనుకున్నట్టుంది కేంద్ర నాయకత్వం. ఆయన కూడా బహుశా తెలుగుదేశంపై చేసిన హంగామాతోనే ఈ పదవి వచ్చిందనుకున్నారో ఏమెూ, మరింత ఊపుతో ప్రతిపక్ష తెలుగుదేశం మీద సజ్జికల్ స్ట్రైక్ చెయ్యడం మెుదలెట్టారు. అదేంటి పోరాటం చెయ్యాల్సింది అధికార పార్టీపైన కదా అనుకున్నారా, అదీ చేస్తారు అమావాస్యకు, పౌర్ణమికి. దానికి కూడా ఓ టెక్నిక్ ఉందండోయ్… అధికార పార్టీని ‘ఇడ్లీతో’ కొట్టినట్టు, ప్రతిపక్ష పార్టీని ‘రాయితో’ కొట్టినట్టు చాలా జాగ్రత్తగా విమర్శలు చేస్తారు. ఆయన ‘లెక్కలు’ ఆయనవి.

వచ్చీ రాగానే పార్టీలో తన మాట వినని నాయకులను సస్పెండ్ చేసారు, దీనిలో ‘సామాజిక కోణం’ ఉందని కూడా ఓ ఆరోపణ, కన్నా గారు నియమించిన కమిటీలు అన్నీ మార్చి తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నారని చెబుతారు. ఇలా తనకొక కోటరీ ఏర్పరుచున్నారు. ఇక పార్టీ ఏమైనా పుంజుకుందా అంటే, ఎప్పుడో రిటైర్ అయిన సీనియర్ నటీ నటులను పట్టుకొస్తారు, వారిలో కొందరికి ఆంధ్రలో ఓటు హక్కు కూడా లేదేమెూ! పైగా “టమాటాలు బిజేపికి బలం, మామిడికాయలు బిజేపికి బలం, చింతకాయలు బిజేపికి బలం….” ఇలా కూరగాయల బండి కబుర్లు చెబుతారు. ఆయన శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశం కూడా వచ్చిందండోయ్, ఆయన భాద్యతలు చేపట్టాక ఏపి లో పంచాయితీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ వంటి స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కనీసం ఓ పావు వంతు స్థానాల్లో కూడా అభ్యర్దులను నిలబెట్టలేదు, ఏదో కొన్ని చోట్ల స్థానికంగా బలమైన నాయకుల చొరవతో గెలిచిన కొన్ని తప్ప ఇంక పెద్ద చెప్పేదీలేదు. పవన్ వంటి జనాకర్షణ నేత ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉండీ వీర్రాజు గారు సాదించింది ఏమీలేదు. తిరుపతి పార్లమెంటు, ప్రదాన ప్రతిపక్షం బరిలో లేని బద్వేలు ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇక ఈయన కోటరీ మీద వచ్చే అవనీతి ఆరోపణలు సరేసరి. వీరి వ్యవహారశైలి మీద, కోటరీ కార్యకలాపాలపైన కేంద్ర నాయకత్వానికి అనేక పిర్యాదులు వెళ్ళాయని చెప్పుకుంటారు. కానీ ఎందుకో ఆయన వైపు చూడలేదు.

ADVERTISEMENT

మద్యలో అనేకసార్లు సోముని మార్చేస్తున్నారంటూ పుకార్లు వినబడ్డా ఆయన్ని కేంద్ర నాయకత్వం కదిలించలేదు. ఇలా అధికార పక్షం మీద నేతి ఇడ్లీలా, ప్రతిపక్షం మీద కారం ఇడ్లీలా విన్యాసాలతో ఆయన రెండేళ్ళ పదవీకాలం పూర్తయింది. ఇక వెంటనే మరో నాయకుడిని అధ్యక్షుడిగా నియమిస్తారని గట్టిగా వార్తలు వచ్చినా ఆయనే కొనసాగుతున్నారు. ఆపైన బలమైన మిత్రపక్షం జనసేన కూడా తమ దారి తాము చూసుకుంటామంటూ టిడిపికి దగ్గరౌతుంది. రాష్ట్ర నాయకత్వం వ్వవహారశైలితోనే జనసేన దూరమైందని మాజీ అధ్యక్షుడు కన్నా సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఐదు సార్లు యంయల్ఏ, వివిధ పదవులు నిర్వహించిన అనుభవం, మంచి అనుచరగణం, ఉన్న కన్నా వంటి బలమైన సీనియర్ నాయకుడిని వదిలి, ఏనాడు ప్రజా క్షేత్రంలో గెలువని, చివరకు సొంత ఊరిలో వార్డు మెంబరుగా ఓడిన చరిత్ర ఉన్న వీర్రాజును 25 యంపీ స్తానాలున్న ఆంధ్ర వంటి కీలకమైన రాష్ట్రానికి అద్యక్షుడిగా నియమించడమే ఓ ఆశ్చర్యం అయితే, అనేక ఆరోపణలు, రోజు రోజుకు దిగజారుతున్న పార్టీ పరిస్ధితి, దూరమవుతున్న మిత్ర పర్షం, స్ధానిక, ఉప ఎన్నికల్లో ఘోర వైఫల్యం, అయినా 2024లో సోము నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం అని ఇంచార్జి సునీల్‌ దియెూడర్ చెబుతున్నారు. అంత శక్తి వంతమైన నాయకులు కూడా, సొము ను మార్చలేకపోతున్నారంటే సోము వారికంటే బలమైన నాయకుడై ఉండాలి కదా! మీరేమంటారు.

శ్రీకాంత్ .సి

ADVERTISEMENT
Latest Stories