అధికార పార్టీ నాయకులుగా ఉన్న కూటమి నేతలు వైసీపీ బెదిరింపు రాజకీయాలను, భయపెట్టే విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో ఎందుకో వెనకబడ్డారనిపిస్తుంది.
స్వయంగా వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డే మేము అధికారంలోకి వస్తే ఏపీలో పిపిపి విధానాల్లో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలను 2 నెలలో అరెస్టు చేసి జైల్లో వేస్తాం అంటూ బహిరంగ ప్రకటనలు ఇస్తున్నా వాటిని ప్రచారం చెయ్యడంలో కూటమి ఎందుకో వెనకబడింది.
ఇక పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు రప్ప రప్ప రాజకీయాలు అంటూ ఫలకార్డులతో రెచ్చిపోతున్నా, చీకట్లోనే పని కానిచ్చేసి ఉదయాన్నే వెళ్లి పరామర్శించాలి అంటూ హింస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అలాగే బీజేపీ కానీ ఈ రకమైన వైసీపీ అరాచక రాజకీయాన్ని గ్రౌండ్ స్థాయి వరకు తీసుకెళ్లడంలో మూడు పార్టీలు ఎందుకో వెనకబడ్డాయి.
రైతుల పరామర్శకు వెళ్లి కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్ టైర్ల కింద నలిపేసినా, అమరావతి పై ఇప్పటికి వైసీపీ విష ప్రచారాలు సాగిస్తున్నా, విశాఖ ఐటీ అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తున్నా వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో, వైసీపీ ని దోషిగా నిలబెట్టడంలో ఎందుకో కూటమి వెనకబడినట్లు ఉంది.
ఇక వైసీపీ లిక్కర్ కేసు నుంచి జోగి బ్రదర్స్ నకిలీ మద్యం కేసు వరకు, తిరుమల లడ్డు లో నకిలీ కల్తీ నెయ్యి నుంచి తిరుమల పరకామణి చోరీ కేసు వరకు ఇలా అనేకానేక కేసులలో వైసీపీ ముఖ్యనేతలు ఆరోపణలు ఎదుర్కుంటు అరెస్టయ్యి జైళ్లలో మగ్గుతున్నారు.
అటువంటి కీలక కేసుల విషయంలో వైసీపీ విధానాలను, ఆ పార్టీ నేతలు ఎదుర్కొటున్న అవినీతి ఆరోపణలను కూడా అధికార పార్టీ గట్టిగా ప్రచారం చేసుకోలేకపోతుంది. ప్రభుత్వాలు తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడం ఎంత అవసరమో అలాగే తమ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న అక్రమాలను కూడా ప్రచారం చేయడం అంతే ముఖ్యం.
అటువంటి ప్రచారాలు చేసే విషయంలో వైసీపీ తో పోలిస్తే కూటమి ఎందుకో మొదటి నుంచి వెనకబడే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మినహా కూటమి నుంచి వైసీపీకి గట్టి కౌంటర్లు రావడం లేదనే చెప్పాలి. 2024 వైసీపీ పతనంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ చేస్తున్న రాష్ట్ర వినాశన రాజకీయాలను ఎండకట్టడంలో వెనకబడ్డారనే చెప్పాలి.






