భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపి వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆ పార్టీ చేతలు చూస్తే ఓటమి తప్పదనే భయం, అభద్రతాభావం పైనుంచి క్రింద వరకు అందరిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
2024 ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగడం కోసం వైసీపి ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళుగా చేయని ప్రయత్నం లేదు. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ దుష్ప్రచారం, మరోవైపు వైసీపి నేతల సామాజిక సాధికార తుస్సు యాత్రలు, ఇప్పుడు ఏపీకి జగన్ ఎందుకు అవసరం?కార్యక్రమాలు, ఇక ముందు చేపట్టబోయే అటువంటి మరిన్ని కార్యక్రమాలు వైసీపి అభద్రతాభావానికి నిదర్శనంగా చూడవచ్చు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు నుంచి మాత్రమే సన్నాహాలు ప్రారంభించింది. కానీ ఏపీలో వైసీపి ప్రభుత్వం 2019 మేలో అధికారం చేపట్టిన రోజు నుంచే సన్నాహాలు చేసుకొంటోంది. ఇది అభద్రతాభావం కాదా?ఒకవేళ వైసీపి నేతలకు 175 సీట్లు మేమే గెలుచుకొంటామనే నమ్మకమే ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే బస్సులు వేసుకొని రోడ్లపైకి వచ్చేవారే కారు కదా?
ఇంకా విషాదం ఏమిటంటే వైసీపి నేతల బస్సు యాత్రలకు ప్రజల నుంచి స్పందనే లభించకపోవడం. దీంతో వారిలో ఆందోళన మరింత పెరిగి ఉంటుంది. ఈ యాత్రలకే దిక్కు లేదనుకొంటే మళ్ళీ ఇప్పుడు ‘ఏపీకి జగన్ ఎందుకు అవసరం?’ అనే పేరుతో వెంటనే మరో కార్యక్రమం ప్రారంభించాలని అధినేత హుకుం జారీ చేయడంతో వైసీపి నేతలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలీడం లేదు.
ఇక ఈ కార్యక్రమానికి ఇంగ్లీషులో ‘వై ఏపీ నీడ్స్ జగన్?’ అంటే కాస్త అర్దవంతంగానే ఉంది కానీ దానినే తెలుగులో ‘ఏపీకి జగన్ ఎందుకు అవసరం?’ అని తర్జుమా చేస్తే జనాలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ‘ఆ ప్రశ్న మేము కదా అడగాలి?’ అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే దీనిపై జోకులు పెళుతున్నాయి. అంటే కాన్సెప్టే కాదు టైటిల్ కూడా ఫెయిల్ అయ్యిందన్న మాట!




