ఏపీ రాజధానిగా అమరావతి తనకు అంగీకారం కాదని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆచరణలో చూపారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదే మాటకు కట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఇదే మాటకు జగన్ కట్టుబడి ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కోరుకుంటున్నారు.
జగన్ అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయనతో సహా వైసీపీ నేతలు, ఇంకా చాలా మంది చాలాసార్లు చెప్పారు. కనుక మళ్ళీ ఆ చర్చ అనవసరం. కానీ ఒక్క ముక్క చెప్పుకోక తప్పదు.
సిఎం కుర్చీలో కూర్చోవాలనే తన కలను సాకారం చేసిన కేసీఆర్కి జగన్ ఎప్పటికీ రుణపడి ఉండాలి. మాట తప్పే అలవాటు లేని జగన్, అమరావతి నిర్మించనీయనని ఆయనకు మాట ఇచ్చారా? దానికి కట్టుబడినందునే నేటికీ అమరావతిని ఇంతగా వ్యతిరేకిస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది.
దీనికి సమాధానం సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. “చాలా మంది అనుకుంటున్నారు… అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు ఏమయిందో చూశారు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఆపేస్తామంటున్నారు. అది వాళ్ళ వల్ల కాదు,” అని అన్నారు. ఆ ‘వాళ్ళ’లో కేసీఆర్ కూడా ఉన్నారా?
సరే ఇప్పుడు ఈ చర్చ పక్కన పెడితే, అమరావతికి కాదన్నందుకు వైసీపీకి నష్టం కలిగింది. ఇంకా కలుగుతుందని తెలిసి ఉన్నా జగన్ మళ్ళీ అమరావతి గురించి హటాత్తుగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు? అని మరో సందేహం కలుగుతుంది. దీనికి బలమైన కారణమే కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం రాజధాని కోసం రెండో విడత భూసేకరణకు సిద్దమైంది. కనుక భూములు కోల్పోయే రైతులు ఆవేశంగా ఉంటారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంటారు. ప్రభుత్వం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. వారిని రెచ్చగొట్టడానికే జగన్ అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడారనిపిస్తోంది.
కానీ ఇలాంటి సమయంలో జగన్ మౌనంగా ఊరుకుంటే జరిగేదేదో జరుగుతుంది కదా?ఒకవేళ రైతులు వ్యతిరేకిస్తే కూటమి ప్రభుత్వానికే నష్టం, అప్రదిష్ట కదా?అప్పుడే మాట్లాడవచ్చు కదా?
కానీ ఇక్కడ తనకు మంచి మైలేజ్ దొరుకుతుందని తొందరపడి నోటికి వచ్చినట్లు మాట్లాడి మళ్ళీ దొరికిపోయారు. ఎప్పటిలాగే జ్ఞాన గుళికలు వికటించాయి.
గుంటూరు-ప్రకాశం జిల్లాల మద్య భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయని అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ఎవరికీ నష్టం ఉండేది కాదని జగన్ వాదించారు. నిజమే! జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ రాజధాని ఏర్పాటు చేసేయవచ్చు కదా?కానీ మూడు రాజధానులు అంటూ 5 ఏళ్ళు ఎందుకు కాలక్షేపం చేశారు?
అక్కడ చాలా తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోవచ్చని తెలిసి ఉన్నప్పుడు, విశాఖని ఎందుకు రాజధానిగా చేయాలనుకున్నారు?
నదీ గర్భం అలియాస్ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అమరావతి మునిగిపోయే ప్రమాదం ఉందని బల్ల గుద్ది వాదిస్తున్నప్పుడు, సునామీ, తుఫానులు వచ్చి మునిగిపోయే పెను ప్రమాదం ఉన్న విశాఖలో రాజధాని ఎందుకు నిర్మించాలనుకున్నారు?
రాజధానిపై వృధా ఖర్చు తగ్గించాలనుకున్నప్పుడు విశాఖ రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలస్లు ఎందుకు నిర్మించుకున్నారు? బంగాళాఖాతంలో సునామీ వస్తే? రుషికొండ ప్యాలస్లు కూడా మునిగిపోతే?
అయినా ఉత్తరాంద్ర ప్రజల కోసం ఇంత రిస్క్ తీసుకొని ఆ ప్యాలస్లో కాపురం పెడతానని చెప్పిన జగన్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిలో అడుగుపెట్టేందుకు ఎందుకు సాహసించలేకపోయారు? అనే ప్రశ్నలకు సజ్జల పండితుడి చేత చెప్పిస్తే అందరూ విని సంతోషిస్తారు కదా?






