సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని కొత్త పధకాలు ప్రవేశపెట్టడం లేదా పాత పధకాల పేర్లు మార్చడంవంటివి మాత్రమే చేస్తుంటాయి తప్ప ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం మార్చదు. కానీ ఏపీలో మాత్రం గత టిడిపి ప్రభుత్వం తీసుకొన్న ప్రతీ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పడేసి మళ్ళీ కొత్తగా మొదలుపెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం, మూడు రాజధానుల పేరుతో అమరావతి మొదలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అన్నా క్యాంటీన్ల వరకు దేనినీ జగన్ ప్రభుత్వం వదలలేదు.
టిడిపి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకొంటే దానిని గుడ్డిగా పక్కనపెట్టేయడమే విధానంగా వైసీపీ పాలన సాగిస్తోంది. టిడిపి దాని అధినేత చంద్రబాబు నాయుడు మీద సిఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత ద్వేషం అంటే ఆయన కోట్లు ఖర్చు చేసి ఉండవల్లిలో కట్టించిన ప్రజావేదికలో విలువైన విద్యుత్ పరికరాలను, సీసీ కెమెరాలను కూడా తీయకుండా యదాతధంగా కూలగొట్టించేశారు!
ఆరోజూ నుంచి మొదలైన రివర్స్ అండ్ విధ్వంసకర పరిపాలన విశాఖ సముద్రతీరాన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా నిలిచిన పచ్చటి ఋషికొండకు గుండు కొట్టించడం వరకు సాగుతూనే ఉంది. ఇప్పుడు మూడు రాజధానుల ప్రాంతీయ విబేధాలతో అది పరాకాష్టకు చేరుకొంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోకూడదని కోరుకొన్న ఆంధ్రా ప్రజల చేతే ఇప్పుడు రాజధాని కోసం పరస్పరం కొట్లాడుకొనేలా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే కదా! వీటన్నిటినీ పక్కన పెట్టి వైసీపీ కోణంలో ఆలోచించి, ప్రభుత్వం మారితే నిర్ణయాలు కూడా మార్చాలనుకొంటే, ఒకవేళ వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేయాలి? ఏం చేస్తుంది? అనే ఆలోచన తప్పక కలుగుతుంది.
ముందుగా అమరావతిని మళ్ళీ రాజధానిగా చేయడం ఖాయం. తర్వాత వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను రెంటినీ రద్దు చేయడం ఖాయం. ఇంకా ఇటువంటివి చాలానే ఉన్నాయి. ఈ వ్యవస్థలను కొనసాగిస్తే ఈ పెనుభారం భరించాల్సి ఉంటుంది. అలాగని వాటిని రద్దు చేయాలనుకొంటే వాటిలో పనిచేస్తున్న లక్షలాది వైసీపీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడగొట్టి ఇళ్ళకు పంపించాల్సి ఉంటుంది. కేవలం ఈ రెంటిని రద్దు చేయాలనుకొంటే ఇంత సమస్య ఏర్పడుతుంది. విద్యా వ్యవస్థ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, పరిపాలన పరమైనవి ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ పునసమీక్షిస్తే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలాగని వాటినే కొనసాగించాల్సివచ్చినా సమస్యలు తప్పవు.
ఉదాహరణకి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలతో నిండిపోయిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను కొనసాగించడం సాధ్యమేనా? సాధ్యం కాదనుకొంటే వారి పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే సమస్య తీవ్రత అర్దం అవుతుంది. కనుక వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. కానీ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయినప్పుడు వాటిని సమూలంగా ప్రక్షాళన చేయకతప్పదు కదా!



