రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని విదాల తీవ్రంగా నష్టపోయింది. కనుక వీలైనంత వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకురావలసిన అవసరం ఉందని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పేవారు. ఆ దిశలో ఆయన గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కూడా ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా తలక్రిందులు అయ్యాయి.
భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టించి ఉండాలి. కానీ టిడిపిపై రాజకీయ కక్షతో అమరావతి నిర్మాణపనులు నిలిపివేసి అభివృద్ధికి తొలి బ్రేకులు వేసింది. ఆనాటి నుంచే ఆంధ్రప్రదేశ్ తిరోగమనం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయాలు, కక్ష సాధింపులు, అప్పులు, సంక్షేమ పధకాల గోల, ఎన్నికల హడావుడే తప్ప ‘అభివృద్ధి’ అనే మాటే వినబడటం లేదు.
అదే…తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొలిరోజు నుంచి నేటికీ అభివృద్ధి అజెండాతో దూసుకుపోతోంది. అందుకే అక్కడ కాంగ్రెస్, బిజెపిలు ఎంతగా పోరాడుతున్నప్పటికీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆకాంక్షలు అర్ధం చేసుకొని అందుకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుండటం వలననే సిఎం కేసీఆర్కు అంత ప్రజాధారణ ఉందని చెప్పవచ్చు.
కనుక పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, కేసీఆర్కున్న ప్రజాధారణను కళ్ళారా చూస్తూ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి తన మార్గాన్ని, తన లక్ష్యాలను సవరించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. అలాగని వైసీపీ మంత్రులు, నేతలు అసమర్దులా?అంటే కాదనే చెప్పాలి.
సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీలో అందరూ తమతమ వ్యాపారాలు, కంపెనీలు, కాంట్రాక్టులను ఎంతో సమర్ధంగా లాభసాటిగా నిర్వహించుకొంటున్నారు. మరి ఏపీని కూడా అలాగే ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత, రాజకీయ, పార్టీ ప్రయోజనాలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు కనుక.
ప్రజల ఆకాంక్షలు అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలలో తమనే ప్రజలు గెలిపించాలనికోరు కోవడం అత్యాశే కదా?



