రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఐదేళ్ల వైసీపీ అరాచకాలకు ఇప్పుడు న్యాయం జరుగుతుందని, తమను, తమ పార్టీ అధినేతలను అవమానించిన ఒక్కో వైసీపీ ఉగ్రవాదికి తగిన శిక్షలు పడతాయని ఆశ గా ఎదురు చూసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వారు ఆశించిన స్థాయిలో చర్యలు రాలేదు.
ముందుగా గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు అంటూ మీడియాలో వార్త కథనాలు వచ్చినప్పటికీ వాటిలో వాస్తవం లేదని తేలిపోవడంతో అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తలు నిరాశకు గురయ్యారు.
అలాగే చంద్రాబును, ఆయన కుటుంబాన్ని అవమానించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే అరెస్టు చేస్తుందని భావించిన టీడీపీ శ్రేణులకు ఇప్పటికి ఆ కోరికను నెరవేర్చలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అలాగే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పేర్ని నాని, అంబటి, పోసాని వంటి వారి పై తక్షణ చర్యలు తప్పవని ఆశపడ్డ జనసైనికులకు కూడా తీవ్ర నిరాశే మిగిలింది. ఇలా టీడీపీ, జనసేన రెండు పార్టీల కార్యకర్తలు ఈ విషయంలో తమ అధిష్టానం మీద కాస్త గుర్రుగా ఉన్న మాట వాస్తవం.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కక్ష్య సాధింపు ధోరణిలో కాకుండా చట్ట పరంగా వీరికి శిక్షలు పడేలా చూస్తుంది. దీనితో కొంతమంది వైసీపీ నేతలకు తాము చేసిన పాపాలకు శిక్షలు పడడానికి కాస్త సమయం పట్టవచ్చు కానీ శిక్షలైతే పక్కా అనేది నేటి బోరుగడ్డ అరెస్టు తో రుజువయ్యింది.
అటు టీడీపీ నేతలైన చంద్రబాబు, లోకేష్ తో పాటుగా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబం పైన కూడా చాల దిగజారుడు వ్యాఖ్యలు చేసాడు బోరుగడ్డ. తానూ జగన్ అభిమానినని, వైసీపీ మద్దతుదారుడనని చెప్పుకుంటూ గత ఐదేళ్లుగా శిశుపాలుడి మాదిరి తన పాపాల పొద్దు పెంచుకుంటూ పోయారు.
నేటితో బోరుగడ్డ పాపాల పొద్దు పగిలింది. తన సొంత ఇంటిలోనుంచి, తన కుటుంబ సభ్యులు చూస్తుండగానే పోలీసులు బోరుగడ్డను అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ప్రబుద్దుడు ఇప్పుడు అధికారుల చేతికి చిక్కారు.
దీనితో టీడీపీ, జనసేన శ్రేణులు బోరుగడ్డ అరెస్టు విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ గత ఐదేళ్లు జగన్ ను చూసుకుని రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులకు ముందుండి ముసళ్ల పండుగ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వాలు విధించే శిక్షలు రాబోయే తరం రాజకీయ నాయకులకు గుణపాఠం కావాలంటూ , ఇన్నాళ్ల తమ ఆవేదనకు ముగింపు పలుకుతున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపించి కక్ష్య పూరిత రాజకీయానికి తెరలేపిందంటూ అరెస్టయిన ఒక్కో వైసీపీ నేత ఊచలు లెక్కపెడుతున్న జైలుకు వెళ్లి మరి ఆయా నేతలకు ఓదార్పు యాత్ర, జైలు పరామర్శ చేసి తన సంఘీభావాన్ని తెలుపుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అరెస్టయిన బోరుగడ్డ అనిల్ ను కూడా తమ పార్టీ నాయకుడిగా ప్రకటించి ఆయనను కూడా పరామర్శించడానికి జగన్ జైలు యాత్ర మొదలుపెడతారా అనేది చూడాలి. అయితే కూటమి ప్రభుత్వం సరిగా ద్రుష్టి పెట్టాలే కానీ వైసీపీ లో ఇటువంటి వారి చిట్టా చాల పెద్దదే సుమీ.
ఈవీఎం లను ధ్వంసం చేసిన పిన్నెల్లి మాదిరి, టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన నందిగామ సురేష్ మాదిరి బోరుగడ్డ అనిల్ కూడా అమాయకుడు, తానూ ఒక వైసీపీ శ్రేయోభిలాషి కాబట్టే తనను కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపింది అంటూ జగన్ బోరుగడ్డను ఓదార్చడానికి జైలుకు వెళ్లే సాహసం చేస్తారా.?
ఒకవేళ జగన్ అలా చేస్తే, బోరుగడ్డ అనిల్…బాబు, లోకేష్, పవన్ ల మీద చేసిన నీచమైన విమర్శలు ఇప్పటికి సోషల్ మీడియాలో సాక్ష్యాలుగా కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి కనుక జగన్ ఆ వ్యాఖ్యలను సమర్దిస్తున్నారనే ప్రజలు భావిస్తారు. అప్పుడు జగన్ సమాజం ముందు తలవంచక తప్పదు.
అలా కాకుండా జగన్ బోరుగడ్డ అరెస్టు విషయంలో సైలెంట్ గా ఉంటే…వైసీపీ పార్టీ కోసం, జగన్ ను నమ్మి ఇంతా చేస్తే, ఆ చర్యలతో తమకు ప్రభుత్వాల నుండి ఆపద వస్తే జగన్ పక్కకు తప్పుకుంటారా అంటూ వైసీపీ పార్టీ క్యాడర్ లో అసంతృత్తి వ్యక్తమవుతోంది. ఇలా బోరుగడ్డ విషయంలో జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుకగొయ్యి అన్న చందంగా ఉంది.




