రాష్ట్రం ఆర్ధికంగా చిన్నాభిన్నంలో ఉంది ఆదుకోండి మహా ప్రభో… అంటూ ఆంధ్రప్రదేశ్ ధీనంగా అర్ధిస్తున్నా… కనికరించని కేంద్ర ప్రభుత్వం కంటే ప్రపంచ బ్యాంక్ నయమనిపించే విధంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి 5000 కోట్ల ఋణం మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు అందుకున్న ప్రపంచ బ్యాంకు, తొలి విడతగా 5 వేల కోట్ల రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిధులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో ప్రపంచ బ్యాంక్ నుండి ఈ సమాచారం అందుకోవడం విశేషం. ఈ రుణం చెల్లింపునకు దీర్ఘకాల పరిమితి ఉన్న నేపథ్యంలో దానిని స్వీకరించేందుకు చంద్రబాబు సర్కారు కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలే నిధుల లేమితో కోరవడుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ వార్త ఊరటనిస్తోంది.
మూడు రోజుల క్రితం ఏపీకి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలోని పరిస్థితులపై సమగ్ర పరిశీలన జరిపి అధికారులతో కీలక చర్చలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రుణాన్ని అందించేందుకు ఆ బ్యాంకు నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. ఈ రుణ చెల్లింపునకు 30 నుంచి 40 ఏళ్ల కాలపరిమితి ఉండటంతో రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కూడా మొగ్గుచూపుతోంది. గత చంద్రబాబు హయంలో కూడా ప్రపంచ బ్యాంక్ ఏపీకి ఋణం మంజూరు చేసిన విషయం విజ్ఞులకు విదితమే. దీంతో అభివృద్ధి విషయంలో చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ నిధులను కేటాయించేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.



