‘పశ్చిమ బెంగాల్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే’ అని ప్రధాని మోడీ చెప్పి వెళ్ళాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి ‘తెలంగాణలో ఇతర పార్టీ నేతలకు బిజేపి తలుపులు తెరవాలని’ చెప్పి వెళ్ళారు.
అయన ఢిల్లీ వెళ్ళి తెలంగాణ రాష్ట్ర బిజేపి ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ని పంపించారు. అయన వచ్చి కీచులాడుకుంటున్న బండి సంజయ్, ఈటల రాజేందర్లను కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు. ఇంకా చాలా మందిని ఈవిధంగా కలపడానికి తాను వచ్చానని పాటిల్ చెప్పారు.
అయితే ఇలాంటి ‘రాజీ ఆపరేషన్లు’ ప్రతీ పార్టీలోను జరుగుతూనే ఉంటాయి. కనుక ఇదేమీ కొత్త విషయం కాదు. గొప్ప విషయం అంతకంటే కాదు. కానీ తొలి రాజీ సమావేశం తర్వాత ఆయనో మాటన్నారు.
రాబోయే నెల రోజుల్లో తెలంగాణ బిజేపిలో అత్యంత కీలకమైన రాజకీయ పరిణామం జరుగబోతోంది. మేము బిజేపి తలుపులు బార్లా తెరువబోతున్నాము. అప్పుడు మా పార్టీలోకి వచ్చేవారిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు,” అని అభయ్ పాటిల్ అన్నారు.
అంటే ‘ఆపరేషన్ రాజీ’ తర్వాత ‘ఆపరేషన్ ఆకర్ష’ మొదలవబోతోందన్న మాట!
అయితే బిజేపి తలుపులు తీయగానే ఇతర పార్టీల సీనియర్ నేతలు ఎవరూ పరుగున వచ్చేయరు. కానీ కొందరిని రప్పించేందుకు ఇప్పటికే కొన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. అవేమిటో అందరికీ తెలుసు. కనుక ముందుగా వాటి బాధితులు రావచ్చు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కనుక అప్పుడే ఎవరూ బిజేపిలోకి వెళ్ళకపోవచ్చు.
బీఆర్ఎస్ పార్టీలో కేసులున్న సీనియర్ నాయకులు కొంత మంది ఉన్నారు. అటువంటివారు ముందుగా బిజేపిలోకి జంప్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కానీ బీఆర్ఎస్ పార్టీ మూలస్తంభాన్ని బిజేపి కదిలించగలిగితేనే అభయ్ పాటిల్ చెప్పుకున్నట్లు అందరూ ఆశ్చర్యపోతారు. లేకుంటే సినిమా టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్లాగ పాటిల్ ప్రగల్భాలు కూడా రాజకీయ ప్రమోషన్స్లా మిగిలిపోవచ్చు.
బిజేపి తలుపులు తెరుస్తోందని ప్రకటించారు కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ నేతలు జంప్ చేయకుండా జాగ్రత్త పడక తప్పదు.




