వైసీపీ – బిఆర్ఎస్ ల మధ్య విడదీయరానటువంటి రాజకీయ బంధుత్వం ఉందని, అలాగే కేసీఆర్ – జగన్ ల మధ్య విడిపోలేనటువంటి ఆత్మబంధం ఉందని రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో జోరుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది.
అందుకు తగ్గట్టే ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఒకరికొకరు కుదిరితే తెరచాటు సాయం కుదరకపోతే బహిరంగ మద్దతు ప్రకటిస్తూ ఒకరి గెలుపులో మరొకరు తోడయ్యారు, అలాగే ఒకరి ఓటమిలో మరొకరు భాగమయ్యారు.
ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా రెండు రాష్ట్ర రాజకీయాలలో మారుతున్న రాజకీయ పరిణామాలను ఒక్కసారి గమనిస్తే, ఏపీలో ఎన్నో ఏళ్ళ నుంచి నిద్రావస్థలో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు నేడు న్యాయస్థానంలో విచారణకు వచ్చింది, అలాగే జగన్ వ్యక్తిగత హాజరు తప్పనిసరైయ్యింది.
ఇక ఇటు తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ నేడు అధికారులకు అనుమతినిచ్చారు. దీనితో ఇన్నాళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్న కేటీఆర్ పై విచారణ అంశం ఇప్పుడు ఒక్కసారిగా బిఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ఈ పరిణామాలను గమనిస్తే ఇది యాదృచ్ఛికమే అయినా ఇలా ఒక్కరోజే ఇరు పార్టీల అధినేతలు విచారణ పేరుతో వార్తలలో నిలవడంతో పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ ఇటు పార్టీల అధినేతలలో అంతర్మధనం మొదలయ్యిందనే చెప్పాలి.
ఈ విచారణ ఏ దశ వరకు వెళ్తుందో అన్న ఆందోళన, అది పార్టీని ఏ విధంగా ప్రభావితం చేయనుందో అన్న భయం ఇరు పార్టీల నేతలను, క్యాడర్ ను కంగారు పెడుతుంది. గతంలో జగన్ లేకున్నా పార్టీని నడిపేందుకు ఆయన సోదరి షర్మిల ముందుకొచ్చారు, అలాగే పార్టీని తన పాదయాత్రలతో రాజకీయంగా బలపరిచారు. కానీ వైసీపీ కి ఇప్పుడా అవకాశం లేదు.
ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే కేటీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు దిగితే పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా.? అందుకు ఆయన వయస్సు, ఆరోగ్యం సహకరిస్తాయా.? అన్న అనుమానాలు బిఆర్ఎస్ క్యాడర్ ను సైతం వెంటాడుతున్నాయి.
ఇక కవిత ఇప్పటికే బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటికెళ్లారు. దానికి తోడు కవిత బిఆర్ఎస్ పార్టీ విధానాలపై, ఆ పార్టీ నాయకత్వ పద్దతుల పై తన వ్యతిరేక స్వరాన్ని బలంగా వినిపిస్తూనే వస్తున్నారు. కాబట్టి బిఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ కి హరీష్ తప్ప మరోమార్గం లేరనే చెప్పాలి. ఇలా ఈ ఇద్దరి ఆత్మబంధువులకు ఇప్పుడు పార్టీ భవిష్యత్ పై అంతర్మధనం మొదలయినట్టే అనుకోవాలా.?






