వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కొందరు రౌడీయిజం చేస్తే మరికొందరు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసేవారు. కొందరు భూములు కబ్జాలు చేసేవారు మరి కొందరు ఏకంగా పోర్టు కబ్జా చేశారు. మద్యపాన నిషేదం కాస్తా మద్యం సిండికేట్గా మారి వేలకోట్ల అవినీతి జరిగింది. కనుక వైసీపీలో ఎవరికి ఏ రంగంలో అనుభవం ఉంటే ఆ రంగంలో దున్నేసుకున్నారు.
ఈ జాబితాలలో ఉన్నవారిని లెక్కించడం కంటే లేనివారిని లెక్కించడమే సులువు. కనుక వైసీపీలో చెలరేగిపోయినవారి జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి , వైసీపీ సీనియర్ నేత అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా కూడా ఒకరు. ఆయన గురించి కడప ప్రజలను అడిగితే కధకధలుగా చెప్తారు.
కనుక ప్రభుత్వం మారగానే ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి నోటీస్ పంపినా విచారణకు హాజరుకాకపోవడంతో లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. పోలీసులు ఊహించిన్నట్లే ఆయన ముంబయి నుంచి కువైట్ వెళ్ళిపోతుంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏపీ పోలీసులు వెంటనే ముంబయి వెళ్ళి ఆయన అదుపులో తీసుకొని కడప పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్నారు.
ఆ తర్వాత ఎపిసోడ్స్ ఎలా సాగుతాయో అందరికీ తెలుసు కనుక ఇప్పుడు వాటి ప్రస్తావన అనవసరం. కానీ కొందరు వైసీపీ నేతలు దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టం అయ్యింది. అటువంటి ప్రయత్నం చేస్తారనుకునే వారిపై పోలీసులు కూడా ఓ కన్నేసి ఉంచి లుక్అవుట్ నోటీస్ జారీ చేసి మరీ అరెస్ట్ చేస్తారని స్పష్టం అయ్యింది.
ప్రస్తుతం ఏపీ పోలీసులు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కోసం ఢిల్లీలో, మాజీ మంత్రి కాకణి కోసం హైదరాబాద్లో గాలిస్తున్నారు. ఇంకా పలువురు అజ్ఞాతంలో ఉన్నారు. కొందరు లోపలకు వెళ్ళి వచ్చేసినందునో లేదా ముందస్తు బెయిల్ లభించినందునో ప్రెస్మీట్ పెట్టి చాలా ధైర్యంగా ఎదురుదాడి చేస్తున్నారు.




