పవన్‌ పర్యటనకు కొడాలి అనుమతిస్తారట కానీ…

Kodali-Nani-Challenges Chandrababu-Naidu-చాలా రోజులుగా ‘సైలంట్ మోడ్’లో ఉన్న గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్ళీ నేడు మీడియా ముందుకు వచ్చి నోటికి పనిచెప్పారు. నలబై ఏళ్ళు రాజకీయాలలో ఉండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోయారు. ఇప్పుడు ప్రాజెక్టుల పర్యటన పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఆయనకు కొందరు వంతపాడుతున్నారు. ఆయనకు రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలు.

నారా లోకేష్‌ ఏదో జారుడు బండ మీద జారుతున్నట్లు పాదయాత్ర చేస్తున్నారే తప్ప ఎవరూ అతనిని పట్టించుకోవడమే లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో వారాహి యాత్రలు చేసుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు బ్యాచ్‌తో కలిసి మాతో రాజకీయాలు చేయాలనుకొంటే గుడ్డలు ఊడదీసి నడిరోడ్డు మీద నిలబెడతాము,” అని హెచ్చరించారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ, ఐ‌టి కంపెనీల గురించి మాట్లాడుకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావన లేకుండా కష్టం. అలాగే సమైక్య రాష్ట్రంలో, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఆయన హయంలో సోమవారం పోలవరంకి కేటాయిస్తూ శరవేగంగా పనులు చేయించారు.

అందుకే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మరీ ప్రజలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలవరం పనుల పురోగతిని చూసేందుకు పంపించేవారు. కానీ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరానికి బ్రేకులు వేసి, డయాఫ్రామ్ వాల్వ్ కొట్టుకుపోయిందని చెపుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసింది.

సాక్షాత్ ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేశారు. కనుకనే అక్కడకి ప్రతిపక్ష నేతలు ఎవరూ వెళ్ళకుండా పోలీసులను పెట్టి అడ్డుకొంటున్నారు. మిగిలిన ప్రాజెక్టుల సంగతి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూనే ఉన్నారు.

వాటిపై మంత్రి అంబటికి కానీ కొడాలి నానికి గానీ అవగాహన లేకపోవడం చేతనే ఇటువంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారని అనుకోవలసి ఉంటుంది.

అయినా పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో వారాహి యాత్ర చేయాలనుకొంటే అందుకు కొడాలి నాని పర్మిషన్ అవసరమా? వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్‌ కళ్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అంటే ప్రతిపక్షాలు ఎవరు ఎవరితో కలిసి పనిచేయాలో కూడా వైసీపీ నేతలు డిసైడ్ చేస్తారా?వారి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా వారు సూచించిన ప్రకారమే పాదయాత్రలు, రోడ్ షోలు చేసుకొంటూ కాలక్షేపం చేయాలా?

వైసీపీ నేతలు టికెట్ల కోసమో, పదవుల కోసమో వారి అధినేత మూడు రాజధానులకు వంతపాడుతున్నారు కానీ రాష్ట్రం గురించి, రాష్ట్ర గౌరవం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రాష్ట్రం అప్పులపాలైపోతోందని తెలియదా?రాష్ట్రంలో నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసలు పోతున్నారు?ఏపీకి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఎందుకు రావడం లేదు?ఉన్నవి కూడా ఎందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి? అని ఎప్పుడైనా ఆలోచించి ఉంటే వారు కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి తమ అధినేతను ప్రశ్నించేవారు.

ADVERTISEMENT
Latest Stories