వైసీపీ ఎమ్మెల్యేలకు తమ అధినేత జగన్ వందల కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ప్యాలస్లు ఎందుకు నిర్మించుకున్నారో సందేహం కలుగదు.
మూడు రాజధానులని చెప్పి 5 ఏళ్ళలో ఒక్క రాజధాని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో సందేహం కలుగదు.
ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు మనవే అని జగన్ చెపితే కేవలం 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చేయనే సందేహం కలుగదు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తుమ్మినా దగ్గినా సందేహం కలుగుతుంటుంది.
అటువంటి సందేహమే వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్కి కలిగింది. వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పెట్టేసి దీనికేమంటావు.. లోకేష్?అని ప్రశ్నించేశారు.
ఇంతకీ సార్కి వచ్చిన ధర్మ సందేహం ఏమిటంటే, నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుషికొండని బోడిగుండులా చెక్కేస్తే కొండపై పచ్చదనం అంతా మాయం అయిపోయినప్పుడు అది కనిపించకుండా గ్రీన్ మ్యాట్స్ పరిపించారు. అందుకు నారా లోకేష్ విమర్శించారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్ గుమ్మం దాటి బయటకు వస్తే దారిపొడవునా రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టించుకునేవారు. జగన్ తాడేపల్లి ప్యాలస్ చుట్టూ 10-15 అడుగుల ఎత్తైన బ్యారికేడ్లు పెట్టించుకున్నారు. నారా లోకేష్తో సహా జనం కూడా అది చూసి నవ్వుకునేవారు.
జగన్ ధైర్యం చేసి బయటకు వస్తే అందరికీ ఉదారంగా ముద్దులు, దీవెనలు పంచిపెడుతుండేవారు.. అలా ఫోటోలు దిగుతూ సొంత మీడియాలో వేయించుకునేవారు.. అని నారా లోకేష్ ఒక్కరే కాదు అందరూ ఎద్దేవా చేసేవారు.
కానీ ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నదేమిటి? అంటూ ఓ ఫోటో పెట్టారు. దానిలో ఓ సభలో నేలపై గ్రీన్ మ్యాట్స్ పరిచి ఉన్నాయి. సభకు వచ్చినవారికి ఎండ తగలకుండా పైన షామియానాలు (పరదాలు) వేశారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్న ఆ సభలో జనాలను నీయంత్రించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు తమ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు.
వీటన్నిటినీ 1,2,3,4 అంటూ మార్క్ చేసి ఇప్పుడు ఈ పరదాలు, గ్రీన్ మ్యాట్స్, బ్యారికేడ్లు, ఫోటోగ్రాఫర్లు నీకు వర్తించావా నారా లోకేష్? అని ట్వీట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేగారు భలే పాయింట్ పట్టానని తన తెలివికి తానే మురిసిపోయి ఉండొచ్చు. కానీ ఆయన పెట్టిన పోస్టులోనే సమాధానాలన్నీ ఉన్నాయి కదా?
గ్రీన్ మ్యాట్లు వేస్తే గ్రాఫిక్స్ కోసం,
పరదాలు కడితే అప్రజాస్వామ్యం,
బారికేడ్లు పెడితే ప్రజలకు భయపడి,
ఫోటోగ్రాఫర్స్ ఉంటే ప్రచార పిచ్చి….ఇవి వైయస్ జగన్ గారు సీఏంగా ఉండగా లోకేష్ గారు వాడిన పదజాలం.
నేడు లోకేష్ గారి కార్యక్రమానికి అవే పదాలు వర్తించవా..? pic.twitter.com/oYSCtGBOH6
— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) April 3, 2025




