రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకోవలసివస్తే ముందుగా వైసీపీ గురించే మాట్లాడుకోవాలి. జగన్ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారు. కానీ ముఖ్యమంత్రికాగానే కార్యకర్తలు ఆయన కంటికి ఆనలేదు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలకే దర్శనం ఇవ్వని నిరుపేద కార్యకర్తలను పట్టించుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది.
కార్యకర్తలను కాదని వాలంటీర్లను నియమించుకొని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా రూ.5,000 చెల్లిస్తూ వైసీపీ కోసం వాడుకున్నారు. చివరికి వారిని కూడా రోడ్డున పడేసి పోయారు.
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జగన్కి మళ్ళీ కార్యకర్తలు గుర్తుకువచ్చారు. పాపం వారు కూడా అమాయకంగా మళ్ళీ ‘రప్పా రప్పా’ అంటూ జగన్ వెంట పరుగులు తీస్తూ కేసులలో చిక్కుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
వైసీపీలో కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే జనసేన పార్టీలో కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని ‘మేము జనసేనలో ఉన్నాము. మా నాయకుడు పవన్ కళ్యాణ్’ అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకు బలమైన కారణమే ఉంది.
జన సైనికులకు, వీర మహిళలు పార్టీ సభ్యత్వం తీసుకున్న రోజునే వారికి ఇన్స్యూరెన్స్ చేయించి ఆ ప్రీమియం పార్టీ చెల్లిస్తుంది. టీడీపి ప్రారంభించిన ఈ విధానాన్ని జనసేన కూడా అనుసరిస్తోంది. ఇంతవరకు అనారోగ్యం, ప్రమాదాలలో వీర మహిళలు, జన సైనికులు కలిపి మొత్తం 1,426 మంది మరణించారు. వారి కుటుంబాలకు మొత్తం రూ. 46,73,61,424 (సుమారు 47 కోట్లు) ఇన్స్యూరెన్స్ లభించింది.
రాజకీయ పార్టీలు కార్యకర్తలను, వారి కుటుంబాలను ఈవిదంగా కాపాడుకుంటే, వారు కూడా పార్టీ కోసం సంతోషంగా పనిచేస్తారు. వారు కష్టపడబట్టే ఈసారి శాసనసభ, లోక్సభ ఎన్నికలలో జనసేన పోటీ చేసిన ప్రతీ సీటుని గెలుచుకోగలిగింది. వారి అధినేత పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎం కాగలిగారు కదా?






