నిన్న విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే యువ భారతం మార్పు కోరుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. దశాబ్దాల రాజకీయ అనుభవాలను పక్కన పెట్టి, కొత్త పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం దగ్గర నుండి,
పశ్చిమబెంగాల్ లో హ్యాట్రిక్ విజయంతో పదిహేనేళ్ల మమతా టీఎంసీ కోటలు బద్దలు కొట్టడం, ఇక కేరళంలో LDF తరుపున దశాబ్దం నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్న పినరయి విజయన్ అధికార పీఠానికి దూరమవ్వడం వరకు యువభారతం మార్పు దిశగా పయనిస్తుందా అన్నట్టుగా ఓటింగ్ తీరు కనిపించింది.
దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసించిన డీఎంకే – అన్నాడీఎంకే విజయ్ టీవీకే పార్టీ ముందు తలవంచకతప్పలేదు. అయితే ఆ రెండు పార్టీల ఓటమిని విజయ్ టీవీకే గెలుపుని నిర్దేశించిన వారిలో యువత పాత్ర కీలకంగా మారింది అనేది ఓటర్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
అలాగే మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కూడా యువత ఓటింగ్ కొత్త తరం రాజకీయం వైపు చేసిందనే చెప్పాలి. వెస్ట్ బెంగాల్ ను దీదీ తన కంచుకోటగా చేసుకుని గత పదిహేనేళ్లుగా మరో రాజకీయ పార్టీకి అవకాశం లేకుండా చేసింది. ఆ నిరంకుశత్వమే నేడు చివరికి ఎమ్మెల్యే గా కూడా మమతను ఓటమికి గురి చేసింది.
మితిమీరిన ఆత్మవిశ్వాసం, హద్దులు దాటిన నిరంకుశత్వం మమత టీఎంసీ ని కాలగర్భంలో కలిపేసింది. ఒక్కసారి బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటే ఇక వెస్ట్ బెంగాల్ పై మమత శాశ్వతంగా ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్టుగా బీజేపీ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలను రచిస్తుంది.
కేరళంలో కూడా సింహభాగం ఓటర్లు అక్షరాస్యులే కావడం, అక్కడ కూడా ఓటింగ్ లో యువత కీలకం కావడం రాజకీయ మార్పు తప్పలేదు. దాని ఫలితమే దేశంలో ఎక్కడ ప్రాబవం చూపలేని కాంగ్రెస్ కేరళం ను సొంతం చేసుకోగలిగింది. ఈ గెలుపులో తెలంగాణ ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కూడా కీలకంగా మారిందనే చెప్పాలి.
మొత్తానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మిగిలిన రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీలకు, అధికార పీఠం అందుకోవాలని ఆశపడుతున్న పార్టీలకు ఒక రాజకీయ హెచ్చరిక వంటిదనే చెప్పాలి.
గతంలో మాదిరి రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు కానీ, ప్రచారాలు కానీ, ప్రత్యర్థుల మీద చేసిన, చేస్తున్న విమర్శలు కానీ ఓటర్లను ప్రభావితం చేయలేవని, కేవలం అభివృద్ధి, మార్పు మాత్రమే ఓటర్లను తమ వైపు ఆకర్షించేలా చేస్తాయని రుజువు అయిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అందుకు తగ్గట్టుగా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే నిన్న వైసీపీ మాదిరి నేడు డీఎంకే, టీఎంసీ మాదిరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిందే.




