ఆస్తుల పంచాయితీలో తనని జైలుకి పంపేందుకు చెల్లి షర్మిల కుట్ర చేసిందని ఆ మద్య జగన్ తరపు వకాల్తా పుచ్చుకున్న సొంత మీడియా వాదించిన సంగతి తెలిసిందే. కానీ తమపై బురద జల్లెందుకే జగన్ ఈ కట్టుకధ అల్లారని, ఒకవేళ జగన్ అరెస్ట్ అవుతానని భావిస్తే సరస్వతి పవర్తో సహా తన కంపెనీలలో నాకు, విజయమ్మకి వాటాలు ఇచ్చేందుకు ఎంవోయూపై సంతకం చేసేవారా?అనే షర్మిల ప్రశ్నకు జగన్మీడియా ఇంకా జవాబు చెప్పనే లేదు.
కానీ కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు, ఆదానీ గ్రూప్ నుంచి తీసుకున్న రూ.1,750 కోట్ల లంచాలకు అమెరికా కోర్టులో కేసు నమోదు అవడంతో ఇప్పుడు మనీలాండరింగ్ యాక్ట్ కింద జగన్ని లోపల వేసేందుకు ఈడీకి పెద్ద అవకాశం లభించిందని చెప్పవచ్చు.
దాదాపు పుష్కర కాలంగా అక్రమాస్తుల కేసులో జగన్ని టచ్ చేయలేకపోతున్న ఈడీ ఇప్పుడు ఈ కేసుని విడిచిపెడుతుందని అనుకోలేము. ఇప్పుడు ఎన్డీయేలో ఏపీ సిఎం సిఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు కూడా. కనుక ఆయన కేంద్రాన్ని కదిలించగలిగితే ఈ మనీలాండరింగ్ కేసు జగన్ జైలుకి వెళ్ళక తప్పకపోవచ్చు.
కానీ ఆదానీ గ్రూప్ రూ.8,240 కోట్ల పెట్టుబడితో కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద 470 ఎకరాలలో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ నిర్మించబోతోంది. దానిలో ప్రత్యక్షంగా 4,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఆ ప్రాంతంలో అనేక వందల మందికి ఉపాధి లభించనున్నాయి. కనుక జగన్పై చర్యల కోసం సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదానీకి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం లేదనే భావించవచ్చు.
ఇక అదానీకి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం, మద్దతు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఈ వ్యవహారంలో ఈడీ జగన్పై కేసు నమోదు చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఒకవేళ జగన్పై కేసు నమోదు చేస్తే ఆదానీ రూ.1750 కోట్లు లంచం ఇచ్చిన్నట్లు ధృవీకరించిన్నట్లు అవుతుంది. అంటే ఆదానీ భారత్లోనే కాక అమెరికా కోర్టులో కూడా చిక్కుల్లో పడతారు. అదే జగన్మోహన్ రెడ్డికి కవచంలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కనుక జగన్ ఇంటర్నేషనల్ అయినప్పటికీ ఎవరూ ఆయనని టచ్ చేయలేరు.




