ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనులను తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కొనసాగించడం ఆనవాయితీ. ఒకవేళ వాటిలో తప్పొప్పులు ఉంటే సవరించి పనులు పూర్తి చేయాలి తప్ప పూర్తిగా నిలిపివేయకూడదు. అలా చేస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగడమే కాక అభివృద్ది నిలిచిపోతుంది.
గతంలో సిఎం చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన అమరావతి నిర్మాణ పనులను ఆయనపై ద్వేషంతో జగన్ నిలిపివేయించారు. అలాగే భోగాపురం విమానాశ్రయం కూడా వద్దనుకున్నారు.
కిలోమీటర్లకు, నాటికల్ మైల్స్కు తేడా తెలియని జగన్ విశాఖలో ఓ విమానాశ్రయం ఉండగా భోగాపురం మరొకటి దేనికి?ఆ పేరుతో రైతుల భూములు గుంజుకోవడం దేనికి?అని ప్రశ్నించారు.
ఇదే జగన్…నిన్న భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవగానే, ఏపీ అభివృద్ధి మార్గంలో ఇదో మైలురాయన్నారు. విమానాశ్రయ భూసేకరణ కోసం తన ప్రభుత్వం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ట్వీట్ వేశారు. దీని కోసం ఆనాడు తాను బలమైన పునాది వేయడం వల్లనే ఇది సాధ్యపడిందన్నారు.
కానీ విమానాశ్రయం నిర్మాణం కొరకు వేల కోట్లు అవసరం కాగా తమ ప్రభుత్వం కేవలం రూ.960 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జగన్ తన నోటితోనే చెప్పుకున్నారు కదా?
పిపిపి పద్ధతిని ప్రైవేటీకరణగా అభివర్ణించిన జగన్, ఇప్పుడు జీఎంఆర్ సంస్థను అభినందిస్తున్నారు. విమానాశ్రయం నిర్మిస్తే జైల్లో వేస్తామని హెచ్చరించాలి కదా?
ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్కి విశాఖలోని విమానాశ్రయం వాయుసేన అధీనంలో ఉందనే విషయం కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. అది తేలీకనే నాడు రెండో విమానాశ్రయం దేనికని ప్రశ్నించారు.
అయితే ఆ ప్రశ్నలోనే చంద్రబాబు నాయుడు రెండో విమానాశ్రయం పనులు మొదలుట్టారనే సమాధానం కూడా ఉంది కదా?
జగన్కి సంక్షేమ పధకాలు, వాటితో ఓటు బ్యాంక్, ఫ్యాక్షన్ రాజకీయాలకు మించి తెలీదు. అందుకే రెండో విమానాశ్రయం అనవసరం అనుకున్నారు.
కానీ ఆనాడే సిఎం చంద్రబాబు నాయుడుకి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్పై మనసులో స్పష్టమైన ఆలోచన, ప్రణాళికలు ఉన్నాయి. ఆ ఆలోచనతోనే భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి జగన్కి నాలుగున్నరేళ్లు పట్టింది.
అందుకే 2024 ఎన్నికలలో ఉత్తరాంధ్ర ఓట్లు దండుకోవడానికే మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనదని జగన్ ఒప్పుకున్నట్లే కదా?
జగన్ మాట, ఆలోచనలోనే ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి… అని ఒప్పుకోకపోయినా కనీసం సిఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి, చురుకుగా పనులు పూర్తి చేయించారని జగన్ అభినందించి ఉంటే చాలా హుందాగా ఉండేది కదా?
కానీ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం నిసిగ్గుగా ఆరాటపడ్డారు. జగన్ భాషలోనే చెప్పాలంటే ఇది ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకోవడమే కదా? .
నిజానికి అమరావతి మొదలు విమానాశ్రయం వరకు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు మొదలు డీఎస్సీ వరకు జగన్ హయంలోనే చేసి ఉండొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకొని ఉండొచ్చు కదా? ఎవరు వద్దన్నారు?






