కేంద్ర సర్కారుపై అవిశ్వాసం గురించి మాట్లాడిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారట. పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న జగన్, నేడు పార్టీ ముఖ్యులు, ఎంపీలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
అయితే ఈ అవిశ్వాసం వల్ల బీజేపీతో తమకు ఏ రకంగానూ ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి ప్రస్తుతం ఐదుగురు ఎంపీలే ఉండడంతో అవిశ్వాసానికి అవసరమైన 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టి ఈ నెల 21న అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని వైసీపీ భావిస్తోంది. 50 మంది ఎంపీల మద్దతు ఉంటేనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరిస్తారు.
సభ పని దినాల్లో అది ఎప్పుడైనా జరగవచ్చు. అయితే 21న వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే సరిగ్గా పదో రోజున అంటే ఏప్రిల్ 6న సభ ముగుస్తుంది. ఇప్పటికే బోలెడన్ని బిల్లులపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో సమయాభవం వల్ల వైసీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవచ్చు. సో… అవిశ్వాస తీర్మానం కంచికే అన్నట్టు!
ఆ రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి బీజేపీతో పోరాడుతున్నామన్న భావనను ప్రజల్లో కల్పించవచ్చు.. మరోవైపు బీజేపీకి ఏరకంగా ఇబ్బంది కలగించకుండా బయటపడిపోవచ్చన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లుగా సమాచారం. అయితే వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై గతంలో పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో… ఈ వ్యూహంపై పవన్ ఎలా స్పందిస్తారో అనేది కూడా కీలకంగా మారింది.



