రివర్స్ టెండరింగ్ విధానంతో రివర్స్ గేరులో మొదలైన వైసీపి పాలనలో అన్నీ రివర్స్గానే సాగుతుంటాయని నిరూపించే ఘటన కాకినాడలో జరిగింది. వైసీపి సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం జంక్షన్ వద్ద వైసీపి సభ నిర్వహించారు. ఎప్పుడూ వాహనాలతో చాలా రద్దీగా ఉండే ఆ జంక్షన్ వద్ద జగన్ ఫ్లెక్సీ బ్యానర్లను పెట్టారు. కానీ వాటికి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగింపజేశారు!
ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్కి చెట్టుకొమ్మలో, పార్టీల జెండాలో అడ్డువస్తే వాటిని తొలగిస్తుంటారు. కానీ జగన్ ఫ్లెక్సీ బ్యానర్కు అడ్డుగా ఉన్నాయని దాని కోసం ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్నే తొలగించారు. అది చూసి ప్రజలు రివర్స్ గేర్ పరిపాలన కదా ఇలాగే ఉంటుందని సర్ది చెప్పుకోకతప్పలేదు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తొలగించడంతో సభ జరుగుతున్నంతసేపు ట్రాఫిక్ పోలీసులే వాహనాలను నియంత్రించాల్సి వచ్చింది.
ఇదివరకు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేసినప్పుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు జనాలే లేరని వైసీపి నేతలు ఎద్దేవా చేస్తుండేవారు. కానీ ఇప్పుడు వారు బస్సులు వేసుకొని సామాజిక సాధికార యాత్రలు చేస్తున్నప్పుడు జనాలు రాకపోవడంతో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సభలు నిర్వహించుకొని దారిన పోయేవారితో తమ సభలు విజయవంతం అయ్యాయని గొప్పగా చెప్పుకొంటున్నారు పాపం!




